వాడిపోతున్న ‘గులాబీ’.. టీఆర్‌ఎస్‌లో కీలక నేతల మధ్య విభేదాలు.!

by  |
వాడిపోతున్న ‘గులాబీ’.. టీఆర్‌ఎస్‌లో కీలక నేతల మధ్య విభేదాలు.!
X

దిశ, గోదావరిఖని : మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన రామగుండం నియోజకవర్గంలో ఎన్నికలైనా.. పదవులైనా.. అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తాయి. ఇప్పుడు ఇదే టాపిక్ రామగుండం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారుతోంది. అధికార పార్టీ టీఆర్ఎస్‌లో అధ్యక్ష పదవి కోసం నాయకుల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. నిన్న మొన్నటి దాకా కలిసి మెలిసి తిరిగిన నాయకులే.. నేడు శత్రువులుగా మారి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి వారి విభేదాలు చేరినట్లు నియోజకవర్గంలోని పలువురు నాయకులు చర్చించుకుంటున్నారు.

మొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కోసం రామగుండం నియోజకవర్గంలోని పలువురు నాయకులు పోటాపోటీగా తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. అధిష్టాన నాయకుల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అధ్యక్ష పదవి కోసం తమకు అవకాశం కల్పించాలని ముఖ్య నేతల వద్ద ఎవరికి వారు తమ విన్నపాలను సమర్పించుకున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు స్థానిక రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో ఉన్నవారే ప్రస్తుతం సొంతంగా అధిష్టానం నాయకుల వద్దకు వెళ్లడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. మరికొందరు నాయకులు స్థానికంగా ఉండే మంత్రితో రాయబారం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే గతంలో మేయర్‌గా చేసిన కొంకటి లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాతిపెల్లి ఎల్లయ్య, పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణితో పాటు మరికొందరు నాయకులు అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. కాగా, ఇప్పటికే మొదటి నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో ఎవరికి వారే సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నా.. పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మధ్య మొదటి నుంచి విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ జాబితాలో మరి కొంతమంది నాయకులు చేరడంతో నియోజకవర్గంలోని అధికార పార్టీలో విభేదాలు మరింత భగ్గుమంటున్నాయి.

ఓ వైపు టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అందరూ కలిసి పార్టీ అభివృద్ధికి సహకరించాలని, విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ, దీనికి భిన్నంగా రామగుండం నియోజకవర్గంలో అధికార పార్టీలో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీంతో ఎక్కడ చూసినా నియోజకవర్గ పరిధిలో అధికార పార్టీ విభేదాలపై జోరుగా చర్చ కొనసాగుతోంది. అయితే రామగుండం నియోజకవర్గంలో ఎవరికి వారు.. తమకే అధ్యక్ష పదవి వస్తుందని ప్రచారం చేసుకోవడంపై వివాదాలు నెలకొన్నాయి.

ఇప్పటికే నియోజకవర్గ నాయకులు హైదరాబాద్‌కు నిత్యం చక్కర్లు కొడుతున్నారు. ఇక మరికొంతమంది నాయకులైతే నిన్నమొన్నటిదాకా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో తిరిగి.. ఆయన్ను కాదని నేరుగా అధిష్టానం నాయకుల వద్దకు వెళ్లి తమ విన్నపాన్ని సమర్పించి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారుతున్నది. అధ్యక్ష పదవిపై అధిష్టాన నాయకులు ఎవరి వైపు మొగ్గు చూపుతారో తెలియదు కానీ.. నాయకుల మధ్య విభేదాలు మాత్రం తారాస్థాయికి చేరి ప్రజల్లో బహిరంగ విమర్శలకు దారి తీస్తున్నాయి. రానున్న రోజుల్లో దీనిపై అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed