కాంగ్రెస్, టీజేఎస్ మధ్య విభేదాలు !

by  |
కాంగ్రెస్, టీజేఎస్ మధ్య విభేదాలు !
X

దిశ, వెబ్‌డెస్క్: 2018అసెంబ్లీ ఎన్నికల నుంచి కాంగ్రెస్ పార్టీతో ఫ్రెండ్‌షిప్‌ చేస్తున్న టీజేఎస్… ఇక హస్తం పార్టీకి దూరం జరిగినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా మొన్నటివరకు ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఇరుపార్టీలు.. దోస్త్ కటీఫ్ చెప్పుకున్నాయని పొలిటికల్‌ సర్కిల్‌లో ప్రచారం జరుగుతోంది. ఎక్కడా ఏ సభలో పాల్గొన్నా కేసీఆర్ టార్గెట్‌గా బాణాలాంటి మాటలతో దూసుకెళ్లిన నేతలకు ఇటీవల గ్యాప్ రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. కానీ జరుగుతున్న ప్రచారం ప్రకారం ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతోనే మనసు నొచ్చుకున్న టీజేఎస్ చీఫ్ ఇక తనదారి తనదారి తాను చూసుకొని చేయిగుర్తు పార్టీకి సెండాప్ ఇచ్చాడన్న పాయింట్‌ విశ్లేషకుల నుంచి వినపడుతోంది. అయితే ఇరుపార్టీలకు గ్యాప్ ఎందుకు వచ్చింది ? టీజేఎస్‌ ఫీలయ్యే పని కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందన్నది హస్తంపార్టీ శ్రేణుల నుంచి ఎదురవుతుండగా అసలు విషయం ప్రజెంట్ చక్కర్లు కొడుతోంది.

పార్టీ ఏర్పాటు కంటే ముందు నుంచే ఢిల్లీ నుంచి రాష్ట్రస్థాయి వరకు కాంగ్రెస్‌ నేతలతో సత్సంబంధాలు కొనసాగించిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం టీఆర్ఎస్ తీరు విషయంలో హస్తంపార్టీతో కలిసి నడిశారు. ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిగా ఉంటూ తమ గొంతు వినిపించారు. ప్రాజెక్టుల నుంచి మొదలుకొని ప్రభుత్వ పథకాల్లో లోపాలను ఎత్తిచూపుతూ నిరసన గళం వినిపించి ఒక్కటై నిలిచి ఒక్కమాటే మీదున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌కు అనుకూలంగానే టీజేఎస్ పుట్టిందని ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా స్నేహాన్ని కాపాడుకుంటూ వచ్చారు. సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలపై కీలక సమాయాల్లో అఖిలపక్ష సమావేశాలకు కోదండరాం ముందుండి నడిచి కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలన్నీ ఒక్కమాటపై ఉండేలా చూశారు. కానీ 15రోజుల క్రితం టీజేఎస్ పార్టీకి చెందిన కీలక నేత భవానీ కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో హర్ట్ అయిన కోదండరాం హస్తంపార్టీ పట్ల తీవ్ర నిరాశకు గురైనట్లు సమాచారం.

ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న సమయంలో తమ పార్టీకి చెందిన కీలక నేతను చేర్చుకోవడంపై కినుక వహించిన కోదండరాం కాంగ్రెస్‌ పార్టీ తీరుపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నట్లు తెలుస్తోంది. కలిసి పనిచేస్తున్న సమయంలో తమపార్టీలో బలంగా గొంతు వినిపిస్తున్న మహిళా నేతను మీ వైపునకు తిప్పుకొని తమను బలహీన పర్చేలా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరించడం సరికాదని, ఇంతమాత్రానికి మిత్రపక్షంగా ఉండటం దేనికని కోదండరాం వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై పలువురు కాంగ్రెస్ కీలక నేతలకు సన్నిహితుల ద్వారా ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఒకపార్టీ నుంచి మరో పార్టీకి జంప్ అవ్వడం వల్ల జనాలకు నెగిటివ్ ఫీలింగ్ వెళ్తుందని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వైఖరి మార్చుకుంటేనే భవిష్యత్‌లో మిత్రపక్షాలు జత కూడుతాయని సూచనలు చేసినట్లు పాలిటిక్స్‌లో ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికతో పాటు జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న కాంగ్రెస్ పార్టీ… చేరికలపై దృష్టిపెట్టే కీలక నేతలను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే టీఆర్ఎస్ నుంచి సైతం అసంతృప్త నేతలను పార్టీలోకి లాగి అధికార పార్టీకి గట్టిగ సమాధానం చెప్పాలనే ఉద్దేశ్యంతోనే ఇటీవల టీజేఎస్ నేతను పార్టీలో చేర్చుకున్నట్లు పార్టీ వర్గాల్లో వినపడుతోంది. అయితే చేర్చుకున్న మహిళా నేత కూడా మిత్రపక్షం నుంచే కావడంతో వారు అసంతృప్తికి గురై దూరం జరగాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయితే మళ్లీ కోదండరామ్‌కు నచ్చజెప్పి తమతో ఫ్రెండ్‌షిప్ కొనసాగేలా కాంగ్రెస్ పార్టీ చేస్తుందా లేకుంటే మిత్రపక్షాలను దూరం చేసుకుంటుందా అన్నది ఎన్నికల వేళా పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. మరోవైపు టీజేఎస్ సైతం తమ నేత పార్టీ వీడటాన్ని విశ్లేషించుకొని తదుపరి అడుగులు ఎటువైపు వేస్తుందన్నది రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉంది.

Next Story

Most Viewed