సంచలనంగా సంతు గౌడ్ హత్య.. రంగంలోకి ఆరు స్పెషల్ టీంలు

by  |
సంచలనంగా సంతు గౌడ్ హత్య.. రంగంలోకి  ఆరు స్పెషల్ టీంలు
X

దిశ, జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన సంతు గౌడ్ హత్య కేసును ఈరోజు సాయంత్రానికల్లా ఛేదిస్తామని కమిషనర్ సత్యనారాయణ మీడియాకు తెలిపారు. వెంకటేశ్వర్లపల్లి సమీపంలో జరిగిన ఈ హత్య కేసు మిస్టరీని ఛేదించేందుకు ఆరు స్పెషల్ టీంలను రంగంలోకి దింపామని సీపీ వెల్లడించారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఈ ఘటనలో ప్రత్యక్ష్య, పరోక్ష సంబంధాలున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతంలో దారుణంగా హత్య చేయడానికి గల కారణాలు ఏంటీ, కుట్ర పన్నిందెవరూ అన్న కోణంలో విచారణ చేస్తున్నామని సీపీ తెలిపారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని సమగ్ర విచారణ జరుపుతున్నామన్నారు. 24 గంటల్లోగా నిందితులను పట్టుకుని తీరుతామన్నారు.

అతనికి కాల్ చేసిందెవరో..?

సంతుగౌడ్‌కు ఆదివారం సాయంత్రం ఫోన్ రావడంతో ఇంటి నుంచి వెల్లిపోయాడని, రాత్రి నుంచి ఫోన్ స్విచ్ఛాప్ వస్తోందని తెలుస్తోంది. పథకం ప్రకారమే అతన్ని ఇంటి నుంచి పిలిపించుకుని హత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఆరుగురు పాల్గొని ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ హత్యలో ఈ ప్రాంతానికి చెందిన వారు పాల్గొన్నారా లేక వేరే ప్రాంతం నుంచి వచ్చారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. హత్య కేసు వెలుగులోకి రాగానే రంగంలోకి దిగిన పోలీసులు వెంకటేశ్వరుల పల్లి, విలాసాగర్‌లలో కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరించారా అన్న విషయంతో పాటు సెల్ ఫోన్ టవర్ల ఆధారంగా కూడా ఆరా తీస్తున్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని నిందితులను పట్టుకునే పనిలో పోలీసు యంత్రాంగం నిమగ్నం అయింది. అయితే పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు అనుమానితులు ఇచ్చిన సమాచారం సేకరించి కూడా హంతకుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.


Next Story