నేటితో ధాన్యం కొనుగోలు పూర్తి.. రూ. 758.19 కోట్ల విలువగల ధాన్యం సేకరణ

by  |
నేటితో ధాన్యం కొనుగోలు పూర్తి.. రూ. 758.19 కోట్ల విలువగల ధాన్యం సేకరణ
X

దిశ, మెదక్: జిల్లాలో నేటితో ధాన్యం కొనుగోలు పూర్తయ్యాయని అదనపు కలెక్టర్ రమేష్ చెప్పారు. గత సంవత్సర సీజన్ కంటే ఈ వానాకాలం పంటను 15 రోజుల ముందే రైతుల నుండి పూర్తిగా కొనుగోలు చేసి రాష్ట్రంలో ప్రథమంగా నిలిచామన్నారు. జిల్లాలో నేటితో కొనుగోలు కేంద్రాలు మూసివేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్‌తో కలిసి అధికారులతో మాట్లాడుతూ ఈ వానాకాలం రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయుటకు ప్రాథమిక సహకార సంఘాలు, ఐ.కె.పి, మార్కెటింగ్ శాఖల ద్వారా 378 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. నవంబర్ 2 నుంచి ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల ద్వారా 74,902 మంది రైతుల నుంచి రూ. 758.19 కోట్ల విలువ గల 3,86,833 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు.

అలాగే 57,173 రైతుల ఖాతాల్లో రూ. 547 కోట్ల డబ్బులు వేశామని తెలిపారు. మిగతా 17,729 మంది రైతులకు చెల్లించవలసిన రూ. 211 కోట్ల రూపాయలను ట్యాబ్ ఎంట్రీ, మిల్లర్ అక్నాలెడ్జ్మెంట్ వచ్చిన వెంటనే వేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 90 శాతం ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేశామన్నారు. ఈసారి రైతులకు ముందస్తుగా ఓ.టి.పీ పై అవగాహన కలిగించి ఎన్‌రొల్మెంట్ చేయడం ద్వారా డబ్బుల చెల్లింపులో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి సుమారు వేయి లారీలతో పాటు ట్రాక్టర్లను అనుమతించామని రమేష్ తెలిపారు. అదేవిధంగా ముందస్తుగా బీహార్ నుండి హమాలీలను రప్పించడంతో పాటు మిల్లర్లు కూడా తెప్పించుకోవటం వల్ల కొనుగోలు వేగవంతంగా పూర్తి చేశామని అన్నారు.

మిల్లర్లు ధాన్యాన్ని భద్రపరచుకొనుటకు మార్కెట్ యార్డులలో గోడౌన్లు ఇచ్చామన్నారు. నెలన్నర లోగా పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో సహకరించిన ప్రజా నిధులు, అధికారులకు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. యాసంగిలో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని, పంట మార్పిడి వల్ల మేలు జరుగుతుందన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పనిముట్లు గురించి తెలుసుకుంటూ.. పంటలు సాగు చేయాలని సూచించారు. అదే విధంగా ఒకరి అనుభవాలు మరొకరు పంచుకోవాలని, పంటల దిగుబడిపై వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రమేష్ అన్నారు.

Next Story

Most Viewed