ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు

by  |
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు
X

దిశ ప్ర‌తినిధి, హైద‌రాబాద్: బీసీ, దళిత వర్గాలకు చెందిన ప్ర‌జ‌లు, ఉద్యోగుల‌ మనోభావాలను కించపరిచేలా అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ జాతీయ బీసీ అధికార ప్రతినిధి దాసు సురేష్ హెచ్ఆర్‌సీలో ఫిర్యాదు చేశారు. అనంత‌రం దాసు సురేష్ మాట్లాడుతూ… హ‌న్మ‌కొండలోని ఓసీల ఆత్మ‌గౌర‌వ స‌మావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ధ‌ర్మారెడ్డి ఈడ‌బ్లుఎస్ రిజ‌ర్వేష‌న్ల‌ను ప్ర‌స్తావిస్తూ.. బ‌ల‌హీన వ‌ర్గాల‌కు సంబంధించిన ఉద్యోగులు అస‌మ‌ర్ధుల‌ని, చేత‌కాని వార‌ని, చ‌దువు రాని వార‌ని, వారి వ‌ల్ల‌నే తెలంగాణ వెనుబ‌డి పోతుంద‌ని బీసీ, ద‌ళిత స‌మాజాన్ని కించ‌ప‌ర్చేలా వ్యాఖ్య‌లు చేశార‌ని తెలిపారు.

ఈ వ్యాఖ్య‌లు పూర్తిగా నిరాధార‌మైన‌వ‌ని, బ‌ల‌హీన వ‌ర్గాల‌ను బాధించే విధంగా ఉన్నాయ‌ని, ఇటువంటి ప‌రిస్థితులు పున‌రావృతం కాకుండా ఎమ్మెల్యేపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని దాసు సురేష్ హ‌క్కుల క‌మిష‌న్‌ను కోరారు. ప్రతిభ కేవలం ఒక వర్గానికే పరిమితం కాదని, ఈ దేశ రాజ్యాంగాన్ని రచించింది కూడా దళితుడే అన్న విషయాన్ని ధర్మారెడ్డి గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ధర్మారెడ్డిని అసెంబ్లీకి పంపిన పరకాల నియోజకవర్గంలో 91శాతం పైచిలుకు ఓటు బ్యాంకు బీసీ(52%), ఎస్సీ(25%), ఎస్టీ(12%)లదే అని అన్నారు. బహుజన వర్గాలకు బాసటగా నిలవాల్సిన ఎమ్మెల్యే, అన్నం పెట్టిన చేతికే సున్నం పెట్టిన చందంగా కించపరచడం దారుణం అన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed