హైదరాబాద్‌లో నేరాలు తగ్గుముఖం పట్టాయి: సీపీ

by  |
హైదరాబాద్‌లో నేరాలు తగ్గుముఖం పట్టాయి: సీపీ
X

దిశ, క్రైమ్ బ్యూరో/ సికింద్రాబాద్: హైదరాబాద్ నగరంలో 2019 కంటే ఈ ఏడాది 10శాతం నేరాలు తగ్గుముఖం పట్టాయి. అయితే సాధారణ నేరాలు తగ్గినా, రెట్టింపు స్థాయిలో సైబర్ నేరాలు పెరగడంపై పోలీసు శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2020లో సిటీ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకున్న నేరాలు, కేసుల దర్యాప్తు వివరాలను సోమవారం సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. 2019లో 25,187 కేసులు, ఈ ఏడాది 22,641 కేసులు నమోదయినట్టు తెలిపారు. ప్రస్తుతం నగరంలో 3.61 లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయని, ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి 16వ స్థానం లభించగా, దేశవ్యాప్తంగా నివాసయోగ్య నగరాల్లో హైదరాబాద్‌కు నంబర్‌ వన్ స్థానం లభించినట్టు వివరించారు. లాక్‌డౌన్ కారణంగా సాధారణ నేరాలు తగ్గినప్పటికీ సైబర్ నేరాలు విచ్చలవిడిగా పెరిగాయన్నారు. 2019లో 1,393, ఈ ఏడాది 2,456 కేసులు ఫైల్ అయ్యాయన్నారు. నగరంలో సైబర్ నేరాలను నియంత్రించేందుకు ప్రతి జోన్‌లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. డయల్ 100 ద్వారా ఐదు జోన్ల పరిధిలో రూ.2 లక్షల ఫిర్యాదులను స్వీకరించి, అటెండ్ చేశామననారు. పదే పదే నేరాలకు పాల్పడుతున్న 123 మందిపై పీడీ యాక్ట్ బుక్ చేసినట్లు పేర్కొన్నారు.

తగ్గిన రోడ్డు ప్రమాదాలు..
కరోనా కారణంగా 2నెలలు లాక్ డౌన్ విధించడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. 2019 కంటే 2020లో ట్రాఫిక్ ఉల్లంఘనులకు సంబంధించిన కేసులు పెరిగాయి. డ్రంకన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, విత్ అవుట్ హెల్మెట్, విత్ అవుట్ సీట్ బెల్ట్, సిగ్నల్ జంప్, సెల్ ఫోన్ డ్రైవింగ్ తదితర కేటగిరీలలో 2019లో మొత్తం 39.83 లక్షల కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 45.44 లక్షల కేసులు నమోదయ్యాయి. గతేడాది జరిగిన 259 రోడ్డు ప్రమాదాలలో 271 మంది మరణించగా, ఈ ఏడాది జరిగిన 231 రోడ్డు ప్రమాదాలలో 237 మంది మరణించినట్టు సీపీ అంజనీకుమార్ తెలిపారు.



Next Story

Most Viewed