కరోనా డెత్‌పై కామన్‌మ్యాన్ డౌట్

by  |
కరోనా డెత్‌పై కామన్‌మ్యాన్ డౌట్
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా డెత్స్‌పై కామన్‌మ్యాన్ ప్రశ్నించాడు. కరోనా లెక్కలపై పక్కా డౌట్ రేజ్ చేశాడు. ఆ మాటకొస్తే రాష్ట్ర ప్రభుత్వం రోజూ రిలీజ్ చేస్తున్న బులెటిన్‌పై చాలామందికీ చాలా సందేహాలున్నాయి. ఈ క్రమంలో ఓ సామాన్యుడు మంత్రి కేటీఆర్‌కు చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. తమ బాబాయ్ కరోనా కారణంగా చనిపోయినా బులెటిన్‌లో ఆ విషయాన్ని ఎందుకు దాచిపెట్టారని ట్వీట్టర్ వేదికగా ప్రశ్నల పరంపర సంధించాడు. మే నెల 9వ తేదీన తమ బాబాయికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని, చికిత్స ఫలించక ఈ నెల 10వ తేదీ ఉదయం చనిపోయాడని పేర్కొన్నారు. అయితే అదేరోజు రాత్రికి వెలువరించిన బులెటిన్‌లో ఆ విషయాన్ని ప్రభుత్వం ఎందుకు ప్రస్తావించలేదని 11వ తేదీ ఉదయం 10.04 గంటలకు ‘కేటీఆర్ ఆఫీస్’ అనే ట్విట్టర్ అకౌంట్‌కు అతడు ట్వీట్ చేశారు. బాబాయి కరోనాతో చనిపోయిన కారణంగానే తమ కుటుంబ సభ్యులందరినీ క్వారంటైన్‌కు పంపారని పేర్కొన్నారు. 10వ తేదీన ఎవ్వరూ కరోనాతో చనిపోలేదని పత్రికలు కూడా రాశాయని తెలిపారు. ఈ ప్రత్యేక అంశాన్ని పరిగణనలోకి తీసుకుని తన బాబాయ్ మృతి గురించిన అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు. అయితే, 11వ తేదీ మధ్యాహ్నం వరకూ ఆ ట్వీట్‌కు కేటీఆర్ ఆఫీస్ నుంచి జవాబురాకపోవడం గమనార్హం.

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ దగ్గర ఉన్న వివరాల ప్రకారం.. 10వ తేదీ ఉదయం 8.00 గంటల సమయానికి నగరంలోని జియాగూడ సాయిదుర్గానగర్‌కు చెందిన 51 ఏళ్ళ వయస్సున్న పేషెంట్ (నెం. 1196) కరోనా పాజిటివ్ కారణంగా ప్రభుత్వ పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ట్వీట్ చేసిన వ్యక్తికి ఆ పేషెంట్ బాబాయ్ అవుతాడు. పరిస్థితి విషమించి ఉదయం 10 గంటల తర్వాత ఈ కరోనా పేషెంట్ చనిపోయారు. అయితే రాత్రి 8 గంటలకు రిలీజైన బులెటిన్‌లో అధికారులు ఆ వివరాలను పేర్కొనలేదు. 10 గంటలు దాటినా.. చనిపోయిన వ్యక్తి పేరును బులెటిన్‌లోని మృతుల కేటగిరీలో పెట్టకపోవడానికి కారణమేంటన్నదే ఆ ట్వీట్ చేసిన వ్యక్తి అనుమానం. ఈ నేపథ్యంలో తమ బాబాయ్ కరోనా వల్ల చనిపోయాడా లేక మృతికి మరేదైనా కారణమున్నదా అనేది రూఢీ కావాల్సి ఉందని మరొక ట్వీట్‌లో అభిప్రాయపడ్డారు. సాధారణ అనారోగ్యంతో చనిపోయినా, ఆయనకు కరోనా ఉందని డాక్టర్లు చెప్తున్నారా అనేది కూడా తేలాల్సి ఉందన్నారు.

Next Story

Most Viewed