పీఆర్సీ బిల్లు కావాలంటే కమిషన్ తప్పనిసరి..!

by  |
పీఆర్సీ బిల్లు కావాలంటే కమిషన్ తప్పనిసరి..!
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఉద్యోగులు, ఉపాధ్యాయులు పీఆర్సీ కోసం పోరాటం చేసి సాధించుకున్న సంగతి తెలిసిందే. ఆ పీఆర్సీ కేవలం ఏప్రిల్ 2021 నుంచే అమలులోకి వస్తుందని, జూలై నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు మంజూరు చేసినప్పటికీ, మిగిలిన రెండు నెలల బకాయిలు ఆర్థిక సంవత్సరంలోపు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇన్ని సమస్యల మధ్య పీఆర్సీ అందుకుంటున్న ఉద్యోగులకు ఎస్టీవోలతో తలనొప్పిగా మారిపోయింది. ప్రతి ఉద్యోగికి ఇంక్రిమెంట్, కొత్త పీఆర్సీ వచ్చినప్పుడు సంబుర పడే ఉద్యోగులు గుసగుసలతో ఒకరు చేసే తప్పులు మరొకరు చెప్పుకోవడం జరుగుతోంది.

ఉపాధ్యాయ, ఉద్యోగులకు సకాలంలో ఇవ్వాల్సిన పీఆర్సీ ఇవ్వకపోగా ఐఆర్ కూడా ఇవ్వకుండా కాలయాపనతో మూడేండ్ల తర్వాత పీఆర్సీ అమలు చేస్తామని చెప్పారు. ఆ పీఆర్సీ కూడా ఇదే సంవత్సరం నుంచి వర్తిస్తుందని ప్రభుత్వం చెప్పడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరాశలో పడ్డారు. ఇలాంటి సమయంలో నూతన పీఆర్సీ బిల్లు పాస్ చేయాలంటే కమీషన్లు ఇవ్వాల్సిందేనని ఎస్టీవోలు ఆయా ఉద్యోగ సంఘాల నేతలకు సూచించినట్లు సమాచారం. దీంతో బిల్లులు చేసేటప్పుడు ఉద్యోగులను, ఉపాధ్యాయులను కచ్చితంగా రూ.1000 చెల్లించాల్సిందేననే డిమాండ్ పెట్టడంతో ఒక వైపు చెప్పుకోలేక.. మరోవైపు ఇవ్వలేక మథన పడుతున్నారు. ప్రధానంగా ఈ తంతూ ఉపాధ్యాయులల్లో అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఒక్క మండలం నుంచే రూ.3 లక్షలకు పైగా వసూల్…

రంగారెడ్డి జిల్లాలో 17 ఎస్టీవో కార్యాలయాలు ఉన్నాయి. ఈ కార్యాలయాల పరిధిలో సుమారుగా 12,000లకు పైగా ఉపాధ్యాయులున్నారు. వీరందరికి నూతన పీఆర్సీ బిల్లు పాస్ కావాలంటే మనిషికి రూ.1000 చెల్లించాల్సిందేననే నిబంధనలు పెట్టినట్లు సమాచారం. ఇందులో ఉపాధ్యాయ సంఘాల నాయకులను చెల్లించమని చెప్పేందుకు వెనుకడగు వేస్తున్నారు. కానీ ఉపాధ్యాయుల్లో కొంత మంది.. సంఘం నాయకుల పేరుతో ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు.

ఉదారహణకు రంగారెడ్డి జిల్లాలోని హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లో కలిపి మొత్తం 326 స్కూల్స్ ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 4 కాంప్లెక్సులుగా విభజించగా 370 మంది ఉపాధ్యాయులు సుమారుగా పనిచేస్తున్నారు. ఒక్క హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల పరిధిలోని టీచర్ల నుంచే రూ.3,70,000 వసూల్ చేస్తే ఒక ఎస్టీవో పరిధిలో సుమారుగా నాలుగు మండలాలు వస్తున్నాయి. ఈ విధంగా ఎన్ని లక్షల రూపాయాలను అక్రమంగా వసూల్ చేస్తున్నారో అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సామాన్య ఉద్యోగికి కష్టమే…

జిల్లాలోని రెవెన్యూ, అగ్రికల్చర్, పోలీసు విభాగాలతో పాటు తదితర సంస్థల్లోని ఉద్యోగుల నుంచి ఇష్టమున్నట్లు వసూల్ చేస్తున్నట్టు సమాచారం. ఇక్కడ హెచ్‌ఓడీల స్థాయిలోనే కమీషన్లు నిర్ణయిస్తున్నారు. వసూల్ చేసిన కమీషన్ల నుంచే మధ్యవర్తులుగా వ్యవహరించే కొంత మంది వ్యక్తులు పంచుకోవడం, జల్సాలు చేస్తారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేని కుటుంబాలు, కరోనా కాలంలో ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసిన ఉద్యోగులు నోరు విప్పలేక.. కమీషన్లు ఇవ్వలేకపోతున్నారు. కమీషన్లు ఇస్తే బిల్లులు పాస్ కావనే సంస్కృతికి చెక్ పడేది ఇంకెప్పుడని కొంత మంది ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు.

అవినీతిని అరికట్టాలని డీటీఓకు వినతి పత్రం

ప్రస్తుతం పీఆర్సీ బిల్స్ మంజూరి కాలం… ప్రతి ఉపాధ్యాయుడు, ఉద్యోగికి డీడీఓలు పెరిగి జీతానికి అనుగుణంగా బిల్స్ చేసి సంబంధిత ఎస్టీఓలో బిల్స్ సమర్పిస్తారు. ఈ సందర్భంలో సత్వరమే బిల్స్ మంజూరు చేయడానికి ఆయా ఎస్టీఓ కార్యాలయాల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని టీఎస్‌యూటీఎఫ్ నాయకులు తెలియజేశారు. ఈ అవినీతిని అరికట్టి, బిల్స్ మంజూరిలో ఆలస్యాన్ని నివారించి తగు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బింగి రాములయ్య, మొదినె వెంకటప్పలు రంగారెడ్డి డీటీఓకు మొమొరాండం సమర్పించారు. ఏ ఉపాధ్యాయుడు ఎవ్వరికి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదని, మన జీతాలు పొందడం మన హక్కు అని వారు అన్నారు. ఇది వరకే ఎస్టీఓలకు ఆదేశాలు ఇచ్చామని, ఏ అధికారైనా డబ్బులు డిమాండ్ చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని డీటీఓ టీఎస్ యూటీఎఫ్ నాయకులకు హామీ ఇచ్చారు.



Next Story