‘ప్రభుత్వం ప్రకటించేవరకూ రైతులు వరి సీడ్ కొనవద్దు’

by  |
Collector
X

దిశ, నిజామాబాద్: ప్రభుత్వం వ్యవసాయ పాలసీ ప్రకటించే వరకూ రైతులు వరి సీడ్ కొనుగోలు చేయవద్దని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సీ.నారాయణ రెడ్డి అన్నారు. జిల్లాలో రాబోయే వానాకాలంలో వ్యవసాయంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయ పాలసీపై ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో స్పష్టత ఇవ్వనుందన్నారు. జిల్లాలో ప్రతి రైతుకూ లాభం వచ్చేలా ఏ ప్రాంతంలో ఏ పంట వేయాలో అధికారులు సూచిస్తారని అన్నారు. గతేడాది జిల్లాలో మూడు లక్షల ఎకరాల్లో వరి సాగయిందని, డిమాండ్ ఉన్న పత్తి, కంది, కూరగాయలు వంటి పంటలు ఎక్కువగా సాగుచేస్తే రైతుకు లాభసాటిగా ఉంటుందన్నారు. ఇందులో వ్యవసాయ అధికారులు కీలకమైన పాత్ర పోషించాలని, రైతులకు సరైన రీతిలో తెలియజేసి నమ్మకం కలిగించాలని కోరారు. రైతులకు ఎప్పటికప్పుడూ సమాచారం అందించాలని, ప్రతి విషయం రైతుకు తెలియాలని అన్నారు. రైతులు తమ పొలానికి అవసరమైన ఒండ్రు మట్టిని తమ గ్రామంలోని చెరువుల నుంచి ఎటువంటి అనుమతి లేకుండా తీసుకోవచ్చని, వ్యాపార రీతుల్లో సేకరిస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని రైతులకు తెలియచేయాలన్నారు. పని చేయని వారిపై చర్యలు తీసుకుంటామని, అవసరం మేరకు రెవెన్యూ, ఇతర శాఖల సహకారం తీసుకువాలని ఏఈఓలకు సూచించారు.

Next Story

Most Viewed