దివ్యాంగులు, వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ఓటు

by  |
దివ్యాంగులు, వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ఓటు
X

దిశ, సిద్దిపేట: కోవిడ్-19 నేపథ్యంలో పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని మరింత సౌకర్యవంతం చేసే దిశగా ఎన్నికల సంఘం(ఈసీ) కొత్త మార్గదర్శకాలను జారీ చేసిందని కలెక్టర్ ,జిల్లా ఎన్నికల అధికారి పి .వెంకట్రామ రెడ్డి తెలిపారు. నూతన మార్గదర్శకాల ప్రకారం.. పోలింగ్ కేంద్రానికి రాలేని దివ్యాంగులు, 80 ఏండ్లు పైబడిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని అయన తెలిపారు. ఓటరు జాబితాలో గుర్తించబడిన 80 ఏండ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ఐచ్ఛికాన్ని ఎంచుకోవచ్చనీ తెలిపారు. వారికి అవసరమైన పత్రాలను వారి ఇండ్లకే సంబంధిత బూత్‌ స్థాయి అధికారి(బీఎల్‌వో) పంపిస్తారని తెలిపారు. వారిలో ఎవరైనా పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని ఎంచుకుంటే వారి ఇంటికి బీఎల్‌వో వచ్చి వారితో 12-డీ ఫాంలను పూరించేలా చేస్తారని తెలిపారు. ప్రస్తుతం 12-డీ ఫాంలు అందించి అంగీకారం తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో అంగీకారం ఇస్తూ పూరించిన 12-డీ ఫాం పత్రాలను ఈ నెల 14 కల్లా రిటర్నింగ్‌ అధికారి(ఆర్‌వో)కి బీఎల్‌వోలు సమర్పిస్తారని తెలిపారు. వచ్చిన పత్రాలను పోలింగ్ స్టేషన్ల వారిగా విభజించి ఏ ఏ పోలింగ్ స్టేషన్ కు ఎన్ని బ్యాలెట్ పత్రాలు జారీ చేయాల్సి ఉందో రిటర్నింగ్ అధికారి నిర్ణయిస్తారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్‌ ముద్రించిన తదుపరి ఆర్‌వో నియమించిన ఎన్నికల బృందాలు సెక్యూరిటీ పర్సనల్స్‌తో పోస్టల్‌ బ్యాలెట్‌ ఎంచుకున్న వారి ఇంటికి ముందే తెలిపిన తేదీల్లో వెళ్లతారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఎలా వేయాలో బృంద సభ్యులు అవగాహన కల్పిస్తారని రిటర్నింగ్ అధికారి తెలిపారు. రహస్య ఓటింగ్ కు భంగం కలగకుండా పోస్టల్ బ్యాలెట్‌తో ఓటు హక్కు వినియోగించుకున్నాక దాన్ని నిర్దేశిత షీల్డ్ కవర్‌లో స్వీకరిస్తారని అన్నారు. పోలింగ్‌కు ముందు రోజు వరకు ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. పారదర్శకత కోసం ఈ ప్రక్రియను వీడియోలో చిత్రీకరిస్తారని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆ బ్యాలెట్‌ బాక్సులను ఆర్‌వో వద్ద డిపాజిట్‌ చేస్తారనిఅన్నారు . సర్వీస్‌ ఓటర్లకు అందించే పోస్టల్‌ బ్యాలెట్‌కు దీనికి సంబంధం లేదని తెలిపారు. ఇందులో పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కావాలనుకున్నవారే సంబంధిత పత్రాలను నింపాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. అంతేకాకుండా కోవిడ్‌ బాధితులు, స్వీయ నిర్బంధంలో ఉన్నవారికి సైతం ఈ‌ అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. ఈ అవకాశాన్ని దుబ్బాక నియోజకవర్గానికి చెందిన పోలింగ్ కేంద్రానికి రాలేని దివ్యాంగులు, వృద్ధులు, కోవిడ్ బాధితులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి. వెంకట్రామ రెడ్డి కోరారు.


Next Story