అ ఆ ఇట్లా కాదమ్మా.. విద్యార్థులకు పాఠాలు చెప్పిన కలెక్టర్

by  |
Collector Uday Kumar
X

దిశ, నాగర్ కర్నూల్ : అ ఆ లు ఇలా రాయాలి అంటూ కందనూల్ జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ 3వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. గురువారం పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పాలెం ప్రాథమికోన్నత పాఠశాల, రాంనగర్‌లో ఏర్పాటు చేసిన పోషణ్ అభియాన్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చాలా మంది పిల్లలు తక్కువ బరువుతో సరైన శారీరక అభివృద్ధి లేక ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారిని గుర్తించి వారికి వైద్య చికిత్సలు నిర్వహించడం లేదా వారి ఇంటికి వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి పౌష్టికాహారం ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని అంగన్వాడీ సూపర్వైజర్ ను ఆదేశించారు.

ఇక నుండి అన్ని ప్రాజెక్టుల్లోని అంగన్వాడీ సెంటర్లను సందర్శిస్తానని, రెండు వారముల తర్వాత స్యామ్, మ్యామ్ పిల్లలు ఉండకూడదన్నారు. పౌష్టికాహారం తీసుకోవడం పై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. కేవలం చెప్పడానికే పరిమితం కాకుండా చేతల్లో చేసి చూపించాలని సూపర్వైజర్ లను ఆదేశించారు. తక్కువ బరువు ఉన్న పిల్లల ఇంటికి అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు వెళ్లాలని పిల్లల తక్కువ బరువుకు గల కారణాలను తెలుసుకొని వారికి అవసరమైతే వైద్య చికిత్సలు చేయించడం లేదా ఇంటివద్దే పౌష్టికాహారం ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణీలను మొదటి ట్రైమిస్టర్ నుండే వైద్య పరీక్షలు సకాలంలో చేయించడం, రక్త హీనత లేకుండా పౌష్టికాహారం, ఐరన్ మాత్రలు తీసుకునే విధంగా చూడాల్సిన బాధ్యత అంగన్వాడీ, ఆశా వర్కర్లపై ఉందన్నారు. పెరటి తోట పెట్టుకొని క్రమం తప్పకుండా ఆకు కూరలు తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు.

అంతకుముందు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో కరోనా రాక ముందు విద్యార్థుల శాతం, కరోనా తర్వాతా ఇప్పుడు పాఠశాలలో ఉన్న హాజరు శాతం ప్రధానోపాధ్యాయురాలిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతం తగ్గిపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. 3వ తరగతి విద్యార్థులను పలకరించి వారితో అఆ లు రాయించారు. కరోనా కారణంగా ప్రస్తుతం చదువుతున్న 3వ తరగతి విద్యార్థులకు బాగా నష్టం జరిగిందని వారికి వారి తరగతి స్థాయిని అందుకునే విధంగా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని పాఠాలు నేర్పించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అదేవిధంగా సాయంత్రం వేళ చదువుకున్న విద్యార్థులు మరెవరైన గంటసేపు కూర్చోబెట్టుకొని విద్యాభ్యాసం చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌ని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య, జిల్లా శిశు సంక్షేమ శాఖ సీడీపీఓ, సూపర్వైజర్, అంగన్వాడీ టీచర్, గర్భిణీలు, పిల్లలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed