వరి వేయకండి.. రైతులకు నిజామాబాద్ కలెక్టర్ సూచన

by  |
Collector Narayana Reddy
X

దిశ, నిజామాబాద్ రూరల్: రైతులు ప్రస్తుత రబీ సీజన్లో సాగు చేయబోయే వరి పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయబోదని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ.. వేసవిలో ఉప్పుడు బియ్యం భారత ఆహార సంస్థ కొనడం లేదని అన్నారు. రైతులు ప్రస్తుత రబీ సీజన్లో సన్నరకం ధాన్యం పండించి రైస్ మిల్లర్లకు అమ్ముకోవాలని సూచించారు. జిల్లా రైతాంగం ప్రత్యామ్నాయ పంటలపై శ్రద్ధ చూపాలని సూచించారు. పీఏసీఎస్ చైర్మన్ కొసరాజు రామకృష్ణ ప్రస్తుత రబీ సీజన్లో రైతులు వరిపంట బదులు ఇతర పంటలు సాగయ్యే విధంగా అవగాహన కల్పించాలని వివరించారు.

ఇదిలా ఉండగా.. బర్దిపూర్ పరిధిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం లోడ్లు, అలాట్మెంట్ అయినా, రైస్ మిల్లులో డౌన్లోడ్ కావడం లేదని సహకార సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి కలెక్టర్ వెంటనే స్పందించి అలాట్మెంట్ అయిన రైస్‌మిల్లులు ప్రతి ధాన్యం లోడ్‌నూ అన్లోడ్ చేసుకొమ్మని తెపాలని డీసీఓ సింహాచలానికి సూచించారు. రైతులకు సహకార సంఘ సిబ్బంది, మిల్లర్లు ఇబ్బందులకు గురిచేస్తే తక్షణమే బీ‌సీఓను గానీ, తనను గానీ సంప్రదించాలని సూచించారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, టీసీఓ సింహాచలం, తహసీల్దార్ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి రాంబాబు, సహకార సంఘం చైర్మన్ కొసరాజు రామకృష్ణ, సీఈవో రాజేశ్వర్, క్యాషీయర్ గంగారెడ్డి, క్లర్క్ నారాయణ రెడ్డి, సహకార సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed