భూమి లేని రైతుల కోసమే కిసాన్ క్రెడిట్ కార్డులు

by  |
Collector Gopi, MLA Paddi Sudarshan Reddy
X

దిశ, నర్సంపేట టౌన్: నర్సంపేట పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గోపి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిలు మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూములు లేని రైతులు ఎవరైతే ఉన్నారో వారికి సహాయం అందజేయాలని కిసాన్ క్రెడిట్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్డు ద్వారా రూ.25 వేలకు కేవలం 7 శాతమే వడ్డీ పడేవిధంగా ఈ కార్డులు పనిచేస్తాయని అన్నారు. ఈ 7శాతంలో 4 శాతం ప్రభుత్వం చెల్లిస్తుందని 3 శాతం మాత్రమే లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం చేసుకునే రైతులకు రుణమాఫీ ఇచ్చిన మాదిరిగానే ఈ పథకానికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని అన్నారు. దాదాపుగా ఏడు వేల మందికి ఈ పథకం వర్తిస్తోందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులను త్వరలోనే గుర్తిస్తామని వెల్లడించారు. వ్యవసాయ భూములపై క్రాప్ లోన్ తీసుకున్న వారికి ఈ పథకం వర్తించదని అన్నారు. నియోజకవర్గంలోని 12 వేల మంది గొర్రెల పంపిణీ పథకానికి మరియు 12 వేల మంది పాల ఉత్పత్తి దారులను గుర్తించినట్లు ఆయన తెలిపారు.

రైతు దరఖాస్తు పెట్టిన 15 నుండి 30 రోజుల వ్యవధిలోనే లోన్ ఇవ్వాల్సిందేనని, ఏదైనా కారణం చేత దరఖాస్తు తిరస్కరిస్తే కారణాన్ని తప్పనిసరిగా తెలపాల్సి ఉంటుందని ఆయన బ్యాంకర్లకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూములు లేని రైతుల గురించి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బ్యాంకర్ల మీటింగ్ జరిగినప్పుడు నా దృష్టికి తీసుకొచ్చారని ఆయన అన్నారు. రెండేండ్ల నుంచి సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అవుతూ నేడు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజనీకిషన్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, అధికారులు, బ్యాంకర్లు, మత్సకార సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



Next Story