దుబ్బాక బై పోల్‌లో వారిదే ‘కీ’ రోల్ : కలెక్టర్ భారతి

by  |
దుబ్బాక బై పోల్‌లో వారిదే ‘కీ’ రోల్ : కలెక్టర్ భారతి
X

దిశ, సిద్దిపేట : దుబ్బాక ఉపఎన్నికలో సూక్ష్మ పరిశీలకులదే కీలక పాత్ర అని జిల్లా ఎన్నికల అధికారిణి శ్రీమతి భారతి హోళికేరి అన్నారు. ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూక్ష్మ పరిశీలకులను ఆమె ఆదేశించారు. దుబ్బాక ఉపఎన్నికల నేపథ్యంలో సిద్ధిపేట కలెక్టరేట్ కార్యాలయా సమావేశ మందిరంలో బుధవారం మైక్రో అబ్జర్వర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం నుంచి జిల్లాకు విచ్చేసిన దుబ్బాక ఉపఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌-సాధారణ పరిశీలకులు శ్యామలా ఇక్బాల్ ఆధ్వర్యంలో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ ఇచ్చారు.

ఈ సందర్భంగా అధికారిణి మాట్లాడుతూ.. ఎన్నికల పోలింగ్‌ సరళిని క్షుణ్ణంగా పరిశీలించి, నిష్పక్షపాతంగా ఎన్నికలపై సమాచారాన్ని ఎన్నికల సంఘానికి నివేదిక పంపించాలని చెప్పారు. ఎన్నికలు సజావుగా సాగాయా లేదా అనే విషయంపై పర్యవేక్షకులు, అబ్జర్వర్లు తెలపాలన్నారు. జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నిక జరిగేలా భారత ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. దుబ్బాక ఉపఎన్నికల కోసం 58 మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు తెలిపారు.

సూక్ష్మ పరిశీలకులు ఎన్నికల్లో అబ్జర్వర్లకు కళ్లు, చెవులు లాంటివారని, దుబ్బాక ఉపఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌-సాధారణ పరిశీలకులు శ్యామలా ఇక్బాల్ వెల్లడించారు. పోలింగ్ నాడు ఓటర్ల ఐడీ కార్డును పరిశీలిస్తున్నారా లేదా పూర్తయ్యేంత వరకు నిఘా ఉంచాలని సూచించారు. చనిపోయిన ఓటర్ల పేరుతో ఇతరులు వస్తున్నారా? ఓటరు రిజిష్టరులో నమోదు, చెరగని సిరా ఎడమ చేతిపై మార్కింగ్‌ జరుగుతుందా అనే విషయాలపై మైక్రో అబ్జర్వర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ దీపక్ తివారీ, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్- పోలింగ్ పర్సనల్ మైక్రో అబ్జర్వర్స్ ప్రతినిధులు శ్రవణ్, జీవరత్నం, అశోక్ లాల్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed