16నుంచి ఆర్బీకేల ద్వారా చిరు ధాన్యాల సేకరణ

by  |
16నుంచి ఆర్బీకేల ద్వారా చిరు ధాన్యాల సేకరణ
X

దిశ, ఏపీ బ్యూరో: ఖరీఫ్​లో రైతులు సాగు చేసిన చిరు ధాన్యాల పంట కొనుగోలుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇప్పటికే రైతు భరోసా కేంద్రాలు మద్దతు ధరల జాబితాను ప్రకటించగా.. 16 నుంచి కొనుగోలు ప్రారంభమవుతుందని మార్కెటింగ్​ శాఖ ప్రత్యేక కమిషనర్​ ప్రద్యుమ్న ‘దిశ’కు తెలిపారు. రైతులు 15లోగా ఆర్బీకేల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం మొక్కజొన్న, సజ్జ, రాగులను వ్యాపారులు మరీ తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపారుల దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తూ రైతులకు దన్నుగా అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. రైతులు తమ పంటల వివరాలను ఈ-కర్షక్‌లో నమోదు చేసుకుంటేనే మద్దతు ధర పొందడానికి వీలవుతుంది.

మొక్కజొన్నకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.1,850 చొప్పున కనీస మద్దతు ధర ప్రకటించింది. మార్కెట్‌లో ప్రస్తుతం రూ.1,200 నుంచి రూ.1,400 వరకే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. అలాగే సజ్జలు క్వింటాలుకు ప్రకటించిన మద్దతు ధర రూ.2,150 ఉంటే మార్కెట్‌లో వ్యాపారులు రూ.1,500కు మాత్రమే కొంటున్నారు. రాగులకు మద్దతు ధర రూ.3,295గా ఉంటే మార్కెట్‌ ధర రూ.2,600 మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో రైతులకు ఆలంబనగా నిలిచేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. మొక్కజొన్న, సజ్జలు, రాగులకు సంబంధించి ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 100 క్వింటాళ్ల పంటను కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎకరాకు 20క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలని, ఐదెకరాల విస్తీర్ణం కలిగిన రైతు వరకు ఈ పంటలను కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. రైతులు ముందుగా పేర్లు నమోదు చేసుకుంటే వాళ్లు ఏ రోజు తమ పంటను తీసుకురావాలనేది మొబైల్​కు మెసేజ్ ​వస్తుంది. తొందరపడి రైతులు తక్కువ ధరలకు వ్యాపారులకు అమ్ముకోవద్దని అధికారులు సూచిస్తున్నారు.



Next Story