హెచ్ఎండీఏలో కొట్లాట.. లోలోపల

by  |
హెచ్ఎండీఏలో కొట్లాట.. లోలోపల
X

దిశ, న్యూస్ బ్యూరో: హెచ్ఎండీఏలో డిప్యూటేషన్ ఆఫీసర్లు, సంస్థకు చెందిన ఆఫీసర్ల మధ్య కోల్డ్ వార్ జరిగింది. దీంతో ఒకరిపై మరొకరు ఫిర్యాదులకు తెరతీసినట్లు కార్యాలయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సంస్థకు చెందిన అధికారులు పదవీ విరమణ పొందినా అదే పదవిలో కొనసాగేలా పదవీ కాలాన్ని పొడిగించేలా సర్కారు నుంచి ఆదేశాలు తీసుకొచ్చుకుంటున్నారు. తద్వారా ఉన్నవారికి పదోన్నతులు రాకుండా, కనీసం ఇన్‌చార్జీ బాధ్యతలను కూడా పొందకుండా చేస్తున్నారనే ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. ఉన్నత స్థాయిలో పైరవీలు చేసుకుని మరీ కొందరు ఇక్కడకు వస్తున్నారనేది బహిరంగ రహాస్యం. అయితే, డిప్యూటేషన్‌పై వచ్చిన వారికి, హెచ్ఎండీఏ అధికారులకు మధ్య సమన్వయం లోపించింది. ప్లానింగ్ విభాగంలో ఒకరు పదవీ కాలపరిమితి పొడగించాలని కోరారు. అందుకు సర్కారు నుంచి అనుకూల సంకేతాలు వెలువడకపోయినా నెల రోజుల పాటు కొనసాగడంపై కార్యాలయ వర్గాలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బాధ్యతల పొడగింపు రాకున్నా..పదవిలో కొనసాగించడంపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో హెచ్‌ఎండీఏ కమిషనర్ పలు చర్యలు తీసుకున్నారు.

చర్యలు..

రాంకిషన్‌ను హెచ్ఎండీఏ కార్యదర్శి పదవి నుంచి తప్పించారు కమిషనర్. హెచ్ఎండీఏ కార్యదర్శికి ఓఎస్‌డీగా నియామకం చేశారు. అంటే గతేడాది సెక్రెటరీగా బాధ్యతలను నిర్వహించిన ఆయన ఇప్పుడు అదే పోస్టుకు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్‌డీ)గా పని చేయాలి. ప్లానింగ్ విభాగంలో డైరెక్టర్ 2 గా పనిచేసే నరేంద్ర కూడా గత ఏడాది తరహాలోనే పదవీ బాధ్యతలను కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. కానీ, ఆయన మీదున్న ఆరోపణల నేపథ్యంలో కొనసాగించేందుకు మంత్రి కేటీఆర్ ఆదేశాలివ్వలేదని అధికారులు వెల్లడిస్తున్నారు. దాంతో డైరెక్టర్ 2కు ఉన్న బాధ్యతలన్నీ డైరెక్టర్ 1కి అప్పగిస్తూ హెచ్ఎండీఏ కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. డైరెక్టర్ 2 సెలవులో వెళ్లినట్లు కార్యాలయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. డైరెక్టర్ 2ను తిరిగి డైరెక్టర్ హోదాను పొడిగించరాదని ముగ్గురు ప్లానింగ్ అధికారులు ఉన్నతస్థాయిలో విన్నవించుకున్నట్లు సమాచారం. రెండు నెలల క్రితమే హెచ్ఎండీఏలో పనిచేసే ఓ డైరెక్టర్‌ను, మరో ఇద్దరు ప్లానింగ్ అధికారులను బదిలీ చేసిన కమిషనర్ ఈసారి ఏకంగా సెక్రెటరీ, డైరెక్టర్లపై చర్యలు తీసుకున్నారు.

2003 నుంచి ఖాళీల భర్తీలే లేవు..

హెచ్ఎండీఏగా ఆవిర్భావం నుంచి సంస్థకు కొత్త పోస్టులు మంజూరు కాలేదు. ఖాళీ అవుతోన్న పోస్టులు కూడా భర్తీకి నోచుకోవడంలేదు. 2003లో అప్పటి ప్రభుత్వం జీవో 496 ద్వారా అప్పటి హుడాగా ఉన్న సంస్థకు 600 పోస్టులు మంజూరు చేసింది. అప్పుడు హుడా విస్తీర్ణం 1375 చ.కి.మీ.లు. 105 గ్రామాలు మాత్రమే. ఇప్పుడు హెచ్ఎండీఏ విస్తీర్ణం 7,257 చ.కి.మీ.లు 1,032 గ్రామాలు. విస్తీర్ణం పెరిగింది. పోస్టులు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటి వరకు సంస్థకు చెందిన 300 మంది వరకు పదవీ విరమణ పొందారు. దీంతో ఇక్కడ పనిభారం విపరీతంగా పెరుగుతోంది. కానీ, కొత్త పోస్టులకు మంజూరు లేదు. ఇప్పటికైనా సర్కారు పదవీ విరమణ పొందిన వారిని తిరిగి కొనసాగించరాదని, పోస్టులు భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు.

Next Story

Most Viewed