‘కోమటిరెడ్డి’ బ్రదర్స్ మధ్య కోల్డ్‌వార్.. చిచ్చుపెట్టిన టీపీసీసీ..?

by  |
Revanth Reddy Vs Komati Reddy
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా.. ఇద్దరి అన్నదమ్ములకు నిజంగానే పడట్లేదా.. అసలు ఈ వైరం ఎందుకొచ్చింది..?.. ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో.. అటు రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఇదే చర్చ కొనసాగుతోంది. దాదాపు రెండు దశాబ్దాలుగా నల్లగొండ జిల్లా రాజకీయాలను శాసిస్తోన్న కోమటిరెడ్డి వర్గానికి గడ్డుకాలం ఎదురవుతోంది. సాక్షాత్తూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మధ్య సాగుతున్న అంతర్యుద్ధానికి చెక్ పెట్టేదెవరు..?. అసలు వారి మధ్య గొడవకు రాజకీయ కారణాలా.. లేదా వ్యాపార లావాదేవీలా..? అనే ప్రశ్నలు కోమటిరెడ్డి వర్గీయులను సందిగ్ధంలో పడేస్తున్నాయి.

టీపీసీసీపై చేరో మాట..

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియామకం పట్ల ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డి ఒక్క పిల్లాడంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ పదవిని అమ్ముకుందంటూ బాంబు పేల్చారు. దీంతో అధిష్టానం వెంకటరెడ్డి తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఎంపీ వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని, కానీ ఇక నుంచి గాంధీ భవన్ మెట్లు ఎక్కబోనంటూ తేల్చిచెప్పారు. అయితే ఇదే సమయంలో టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ నియామకంపై ఇన్నిరోజులు మౌనం వహించిన రాజగోపాల్ రెడ్డి సోమవారం రేవంత్ నియామకాన్ని సమర్ధిస్తున్నట్టు ప్రకటించి ఒక్కసారిగా సంచలనం సృష్టించారు. రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ చేయడం పట్ల అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూంటే.. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మాత్రం.. రేవంత్‌ను సమర్ధించడం.. కోమటిరెడ్డి వర్గీయుల్లో అల్లకల్లోలం సృష్టించిందనే చెప్పాలి.

ఊహించని షాకిచ్చిన రాజగోపాల్ రెడ్డి..

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఎంపీ వెంకటరెడ్డికి మధ్య గత కొంతకాలంగా అంతర్గతంగా విభేదాలు ఉన్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు ఆ విభేదాలు బయటకు వస్తున్నా.. వారి సన్నిహితులు వాటిని కొట్టిపారేస్తున్నారు. గతంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జరిగింది. ఒకానొక దశలో సాగర్ ఉపఎన్నికలో బీజేపీ తరఫున ఆయనే బరిలోకి దిగుతారనే ప్రచారం లేకపోలేదు. నిత్యం సొంత పార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ రాజకీయ వాతావరణాన్ని హీటెక్కించారు. రాజగోపాల్ రెడ్డి తీరు వల్లే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ పదవి దక్కలేదని ఆరోపణలు లేకపోలేదు. ఈ సంగతి ఎలా ఉన్నా.. కొత్త టీపీసీసీ చీఫ్ నియామకం ముందు వరకు బీజేపీ జపం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీ వీడబోనంటూ చేసిన వ్యాఖ్యలు జిల్లాలో ప్రాధాన్యతను సంతరించుకున్నాయనే చెప్పాలి.

Next Story

Most Viewed