పందేనికి కోడి రె‘ఢీ’

by  |
పందేనికి కోడి రె‘ఢీ’
X

దిశ ప్రతినిధి, ఖమ్మం : సంక్రాంతి వచ్చిందంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే కోడి పందేల కోసం ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. పండుగ మూడు రోజుల్లో జరిగే పందేల్లో రూ.వందల కోట్లు చేతులు మారుతుంటాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పందేల నిర్వహణకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నా, నిర్వాహకులు మాత్రం సీక్రెట్ గా ఏర్పాట్లు చేస్తున్నారు. పందేల కోసం ఆంధ్రలోని ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలతో పాటు, ఆంధ్రప్రదేశ్ కు సరిహద్దు తెలంగాణ ప్రాంతాలైన సత్తుపల్లి, అశ్వారావుపేట, మధిర, ఎర్రుపాలెం తదితర ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో కోడి పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రముఖులు సైతం పందేలకు..

తెలుగు రాష్ర్టాలతో పాటు పక్క రాష్ట్రాలనుంచి కూడా పందెం కాసేందుకు, చూసేందుకు ప్రతీ సంవత్సరం ఎంతో మంది వస్తుంటారు. తెలుగురాష్ట్రాల్లోని ప్రముఖులు, బడా కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు, ఎంపీ, ఎమ్మెల్యే స్థాయి నాయకులు కోడి పందేల్లో పాల్గొంటారు. గతంలో డైరెక్ట్​గా ప్రజాప్రతినిధులు పాల్గొని రూ.లక్షల్లో పందేలు కాసిన ఘటనలూ ఉన్నాయి. వారి అనుచరులు సైతం కోడి పందేల్లో పాల్గొని లక్షల్లోనే పోగొట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి.

చేతులు మారేది భారీగానే..

కోడిపందేలు ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు కొన్ని ఎకరాల స్థలాన్ని సిద్ధం చేస్తారు. ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి మరీ పందేలను నిర్వహిస్తారు. అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు. ఇలా ఆయా ప్రాంతాల్లో పదుల సంఖ్యలో కోడిపందేల నిర్వహణ ఉంటుంది. గతంలో ఆంధ్రానికే పరిమితమైన పందేలు ఇప్పుడు తెలంగాణ లోని కొన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. పండగకు వారం, పది రోజులు ముందుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నీ కలుపుకుంటే పందేల్లో వందల కోట్ల రూపాయలు చేతులు మారుతాయి.

పందేనికి తెలంగాణ కోళ్లు..

ఆంధ్రాలో జరిగే కోడి పందేలకు తెలంగాణ కోళ్లకు భారీగా డిమాండ్ ఉంది. ఇక్కడి కోళ్ల పోరాట మటిమను బట్టి పందెం రాయుళ్లు ధర పెడుతుంటారు. అశ్వారావుపేట పరిసర ప్రాంతాల్లో పదికి పైగా ఫాంలను ఏర్పాటు చేసి పందెం కోళ్లను పెంచుతుంటారు. ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన వనపర్తి జిల్లాలో వీపనగుండ్ల పందెం కోళ్లకు ప్రసిద్ధి. ఇక్కడి నుంచి భారీగా మేలుజాతి కోళ్లను రూ. వేలు పోసి పందెం రాయుళ్లు కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నారు. కాగా, పందెం కోడి ధరలు వింటే ఔరా అనక మానరు. ఒక్కొక్క కోడి ధర రూ.30 వేల నుంచి రూ.లక్షల వరకు పలుకుతుంది. జాతి, పోరాట పటిమ, బలాన్ని అంచనా వేసి కోళ్లను విక్రయిస్తుంటారు. దాదాపు మూడు నెలల పాటు పందేనికి కావాల్సిన తర్ఫీదు ఇస్తారు. అందుకే వీటి ధర ఆయా కోడిని బట్టి రూ. లక్షల్లో కూడా పలుకుతుంది.

నిఘా పెంచిన పోలీసులు..

ఈ సంవత్సరం కూడా కోడి పందేల నిర్వహణ లేదని పోలీసులు చెబుతున్నారు. కొవిడ్ నేపథ్యంలో కోర్టు సైతం కోడి పందేలను నిర్వహించొద్దని స్పష్టం చేసింది. కానీ నిర్వాహకులు మాత్రం సీక్రెట్ గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరు రాష్ట్రాల పోలీసులు నిఘా పెంచారు. మంగళవారం అశ్వారావుపేట, సత్తుపల్లి తదితర ప్రాంతాల్లో పోలీసులు రైడింగ్ చేసి కోళ్లను, పందెం రాయుళ్లను, నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా కోడి పందేల నిర్వహణకు రాజకీయ నాయకుల సపోర్ట్​ ఉంటుందన్న వార్తలూ వినిపిస్తున్నాయి.



Next Story