సాయం అందని వారు సచివాలయంలో అప్లై చేసుకోండి.. జగన్

by  |
jagan
X

దిశ, ఏపీ బ్యూరో: నష్టపోయిన ప్రతీ కుటుంబానికీ అండగా నిలుస్తాం. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటాం. వరద పరిస్థితిపై అధికారులతో పూర్తిగా మాట్లాడాను. వరద బాధితులకు ఇంటికి రూ. 2వేలతో పాటు రేషన్ కూడా అందినట్టు తెలిపారు. ఒకవేళ రానివాళ్లు 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సీఎం వైఎస్ జగన్ నెల్లూరులోని వరద బాధితులను కోరారు. పెన్నానది నుంచి వరద నివారణ కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతకుముందు చిత్తూరు జిల్లా నుంచి నెల్లూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకున్న సీఎం.. అక్కడ నుంచి రోడ్డు మార్గాన నెల్లూరు రూరల్‌ మండలంలోని దేవరపాలెనికి వెళ్లి వరదలు కారణంగా దెబ్బతిన్న రహదారులు, పంటలు, కోతకు గురైన కరట్టను పరిశీలించారు. అక్కడ నుంచి కోవూరు వెళ్లిన సీఎం వరద బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అందర్నీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

నెల్లూరులో పర్యటన సాగిందిలా..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా పర్యటన ముగిసిన అనంతరం రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌ చేరుకున్నారు. అక్కడ సీఎం వైఎస్ జగన్‌కు జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి సీఎం నేరుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని దేవరపాలెంకు వెళ్లారు. అక్కడ వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, పంటలు, కోతకు గురైన కరట్టను పరిశీలించారు. వరద వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వరద నష్టంపై ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం పరిశీలించారు. ఫొటో ఎగ్జిబిషన్‌ ద్వారా వరద నష్టాన్ని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రజాప్రతినిధుల నుంచి వినతి ప్రతాలను సీఎం స్వీకరించారు. వరద బీభత్సంపై ప్రజా ప్రతినిధులను సీఎం అడిగి తెలుసుకున్నారు. అలాగే భగత్‌సింగ్‌ నగర్‌ కాలనీలో కోతకు గురైన పెన్నా నదిని సీఎం జగన్‌ పరిశీలించారు. వరద బాధితులను పరామర్శించిన సీఎం జగన్‌ బాధితులకు భరోసా ఇచ్చారు. ఆ తర్వాత కోవూరు నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటించారు. పెనుబల్లిలో దెబ్బతిన్న రోడ్లు, పాఠశాల, పంట పొలాలను సీఎం పరిశీలించారు. జొన్నవాడ వద్ద తెగిపోయిన పెన్నా నది పొర్లు కట్టని పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. కోతకు గురైన కరట్టను పరిశీలించారు.

జగన్ హామీలు ఇవే ..

‘వరదల వల్ల చాలా ఆస్తి నష్టం జరిగింది. ప్రాణ నష్టం కూడా జరిగింది. నష్టపోయిన ప్రతీ ఒక్కరినీ ఆదుకుంటాం. ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. వరదల వల్ల నష్టపోయిన ప్రతీ కుటుంబానికి రేషన్‌తోపాటు రూ.2వేలు అందించాం. అలాగే రైతాంగానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తాం. కరకట్ట బండ్ నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నాం. ఆ పనులకు త్వరలోనే తానే స్వయంగా శంకుస్థాపన చేస్తాను. కొట్టుకుపోయిన సోమశిల డ్యామ్ అఫ్రాన్ నిర్మాణం కోసం రూ.120కోట్లు మంజూరు చేస్తున్నాం. వరద సహాయం అందని వారు గ్రామ సచివాలయంలో ఈనెల 5లోపు దరఖాస్తు చేసుకోవాలి. ప్రతీ ఒక్కరినీ ఆదుకుంటాం’ అని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వరదల సమయంలో బాధితులను ఆదుకోవడంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, నగర కమినర్ దినేష్ పని తీరును సీఎం జగన్ ప్రశంసించారు. వేళాంగిణి తన సమస్యలు చెప్పుకుని జగన్ ఎదుట కన్నీటి పర్యంతమైంది. ఆమె బాధలు విన్న సీఎం జగన్ చలించిపోయారు. ఆమె కొడుక్కి ఉద్యోగం కల్పించి అదుకొంటానని మహిళకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బీఎంఆర్ ట్రస్ట్ తరఫున వరద సహాయం కోసం రూ.కోటి చెక్కును బీదా మస్తాన్ రావు సీఎంకు అందజేశారు. డీసీఎంఎస్ నిధుల నుంచి రూ. 25 లక్షల వరద సహాయం చెక్కున్‌ చైర్మెన్ వీరి చలపతి సీఎం వైఎస్‌ జగన్‌కు అందజేశారు. సీఎం పర్యటనలో మంత్రులు బాలినేని శ్రీనివాసరరెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఉన్నతాధికారులు ఉన్నారు.



Next Story

Most Viewed