సీఎం యోగి మరో సంచలనం.. యూపీలో ఇద్దరే ముద్దు.. ముగ్గురు వద్దు!

by  |
సీఎం యోగి మరో సంచలనం.. యూపీలో ఇద్దరే ముద్దు.. ముగ్గురు వద్దు!
X

దిశ, వెబ్‌డెస్క్ : సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ తర్వాతే ఎవరైనా అనడంలో అతిశయోక్తి లేదు. రాజకీయాలతో పనిలేకుండా తనకు నచ్చింది చేసుకుంటూ పోవడమే ఆయన మ్యానరిజం. ఆ విధంగా యూపీలో ఆయన తీసుకున్న నిర్ణయాలు పలువిమర్శలకు కూడా దారితీశాయి. అయినా, వేటికి లెక్కచేయకుండా ముందుకు దూసుకుపోతుంటారు. తాజాగా సీఎం యోగి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏదంటే యూపీనే ముందు గుర్తొస్తుంది. ఆ రాష్ట్ర జనాభా 2012 లెక్కల ప్రకారం 20 కోట్లు పైనే.

ప్రస్తుతం ఆ సంఖ్య మరింత పెరగడంతో పరిమిత వనరులు ఉన్న యూపీలో అధిక జనాభాను కంట్రోల్ చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. ఇకమీదట యూపీలోని దంపతులకు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాయితీలు, ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు. అంతేకాకుండా స్థానిక ఎన్నికల్లో పోటీకి నిషేధం వంటి కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిపారు. అందుకోసం జనాభా నియంత్రణకు కొత్త ముసాయిదా బిల్లును యోగి ప్రభుత్వం రూపొందించింది.

ఉత్తరప్రదేశ్ జనాభా బిల్లు-2021 పేరిట రూపొందించిన ముసాయిదాపై ఈనెల 19లోగా తమ అభిప్రాయాలు చెప్పాలని యూపీ లా కమిషన్ పేర్కొంది. పలువురి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నాక ఈ ఏడాదిలోనే దీనికి చట్టరూపం తీసుకొచ్చేందుకు యోగి ప్రభుత్వం యోచిస్తుంది. ఎందుకంటే 2022లో యూపీతో పాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీచే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే యోగి సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాగైనా జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.



Next Story

Most Viewed