దళితుడికే తొలి ప్రసాదం : యోగి

by  |
దళితుడికే తొలి ప్రసాదం : యోగి
X

దిశ, వెబ్ డెస్క్: అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం జరిగిన భూమిపూజ సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓ దళిత కుటుంబానికి తొలి ప్రసాదం పంపారు. ప్రసాదంలో లడ్డూలతో పాటు రామచరిత మానసము, తులసి మాల ఉన్నట్లు సీఎం మీడియా సలహాదారు శాలబ్ మణి త్రిపాఠి పేర్కొన్నారు. అయోధ్యలోని సుధతి ప్రాంతంలో ఉంటున్న మహవీర్ కుటుంబానికి తొలి ప్రసాదం పంపినట్టు ఆయన తెలిపారు. ఆయన ప్రస్తుతం భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సీఎం యోగి ఆయన ఇంటికి వెళ్లారు. అక్కడే భోజనం చేసి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ‘అలీ- భజరంగ్ బలి’ వ్యాఖ్యల కారణంగా ఎన్నికల కమిషన్ ఆయన ప్రచారంపై 72 గంటల పాటు నిషేధించిన అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది.

కాగా, తనకు సీఎం యోగి నుంచి తొలి ప్రసాదం అందడంపై మహవీర్ అమితానందం వ్యక్తం చేశారు. ‘‘నేను ఓ దళితుడిని. సీఎం తనకు, తన కుటుంబానికి తొలి ప్రసాదం పంపారు. తనను గుర్తు పెట్టుకున్నందుకు ఆయనకు రుణపడివుంటానన్నారు. ప్రస్తుతం మేము రెండింతలు సంతోషంతో ఉన్నాం. ఒకటి రామ మందిర నిర్మాణం ప్రారంభం కావడమైతే, రెండోది తొలి ప్రసాదం మాకే అందడం. ఇకపై రాష్ట్రంలో కుల వివక్షకు తావుండదనీ..అందరూ అభివృద్ధి, సంక్షేమం పైనే దృష్టి పెడతారని ఆశిస్తున్నాను ’’ అని మహవీర్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed