Hyderabad Metro :అప్పుల్లో మెట్రో.. వీటి నుంచి గట్టేక్కెదెలా?

by  |
Hyderabad Metro :అప్పుల్లో మెట్రో..  వీటి నుంచి గట్టేక్కెదెలా?
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. కరోనా వైరస్ అన్ని రంగాలనూ ప్రభావితం చేసినట్లే మెట్రోను కూడా ఇబ్బందుల్లోకి నెట్టిందని, అప్పుల్లో కూరుకుపోవడం, వడ్డీలకు వడ్డీలు కట్టాల్సి రావడం శోచనీయమన్నారు. హైదరాబాద్ నగరానికి మెట్రో సేవలు చాలా అవసరమని, భవిష్యత్తులో మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రగతి భవన్‌లో మంగళవారం జరిగిన సమీక్ష సందర్భంగా మెట్రో రైల్ ఆర్థిక ఇబ్బందులపై చర్చించి మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేశారు.

మెట్రోను నష్టాలపై అధ్యయనంచేసి త్వరలో నివేదిక అందించాలని ఆదేశించారు. ఆర్థికంగా నష్టపోతున్న మెట్రో రైల్ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎల్ అండ్ టీ కంపెనీ ఉన్నతాధికారులు విజ్ఞప్తులు చేస్తున్న నేపథ్యంలో కరోనా కష్టాలను అధిగమించి తిరిగి గాడిలో పడేలా ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఆర్థిక నష్టాలను, బ్యాంకు అప్పులను, పేరుకుపోతున్న వడ్డీల భారాన్ని ఈ సమావేశంలో చర్చించారు. అతి తక్కువ కాలంలోనే సురక్షిత ప్రజా రవాణా వ్యవస్థగా సేవలందించి ప్రజాదరణ పొందిందని సీఎం వ్యాఖ్యానించారు. అన్ని రంగాలను ఆదుకున్నట్లే మెట్రోను కూడా గాడిలో పెట్టడానికి కృషి చేస్తుందన్నారు. మెట్రోకు ఏ విధంగా మేలు చేయగలుగుతామో విశ్లేషిస్తామని తెలిపారు. ప్రజావసరాల దృష్ట్యౌ కరోనా వంటి క్లిష్ట సందర్భాల్లో వినూత్నంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి వస్తుందన్నారు. మెట్రోకు పూర్వవైభవాన్ని తీసుకురాగలమో అవగాహన కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.



Next Story

Most Viewed