ఆ లీడర్ ఐదేళ్ల నిరీక్షణ.. సీఎం కేసీఆర్‌‌కు మరో విగ్రహం

by  |
cm-kcr-statue
X

దిశప్రతినిధి, కరీంనగర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఆలస్యమైనా విగ్రహాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలన్న తపనతో ఉన్న పెద్దపల్లి జడ్పీచైర్మన్, మంథని టీఆర్ఎస్ ఇంచార్జీ పుట్ట మధు శుక్రవారం స్థల పరిశీలన జరిపారు. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆయువు పట్టైన మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కేసీఆర్ రెండో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పెదపల్లి, భూపాలపల్లి జడ్పీ ఛైర్మన్లు పుట్ట మధు, జక్కు శ్రీ హర్షిణీలు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లోని చిల్పూర్ ప్రాంతంలో కేసీఆర్ తొలి విగ్రహం ఆవిష్కృతమైన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఐదేళ్ల నాటి కల..

2015లో మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంప్ హౌజ్‌ల శంకుస్థాపన చేసిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అప్పుడు మంథని ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న పుట్ట మధు నిర్ణయించారు. ఈ మేరకు విగ్రహాన్ని కూడా తయారు చేయించి మేడిగడ్డ సమీపంలోని అంబట్ పల్లికి షిప్ట్ చేశారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముందే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని అనుకున్నా.. కేసీఆర్ అప్పడు వద్దని పుట్ట మధుకు సూచించినట్లు సమాచారం. నాటి నుండి ఈ విగ్రహం స్థానిక టీఆర్ఎస్ నాయకుడు లింగపల్లి శ్రీనివాస రావు ఇంట్లో ఉంచారు.

అయితే, రెండున్నరేండ్ల క్రితం ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు కూడా విగ్రహాన్ని ప్రారంభిస్తారని భావించారంతా. కానీ అప్పుడు కూడా పాసిబుల్ కాలేదు. తాజాగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో సీఎం విగ్రహం ఆవిష్కరణ కావడంతో జడ్పీ ఛైర్మన్ పుట్టమధు మేడిగడ్డ వద్ద కేసీఆర్ విగ్రహాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవంగా రాష్ట్రంలోనే కేసీఆర్ మొట్టమొదటి విగ్రహం మేడిగడ్ద వద్దే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఇది రెండో విగ్రహంగా రికార్డుకు ఎక్కనుంది.



Next Story

Most Viewed