ఆ మంత్రులిద్దరు సమానమేనా?

by  |
ఆ మంత్రులిద్దరు సమానమేనా?
X

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటి నుంచీ మంత్రులు ఈటెల రాజేందర్, గంగుల కమాలకర్‌ ఉప్పూ నిప్పుగా ఉంటున్నారు. గతంలో ఈటెల రాజేందర్ ఒక్కరే ఉమ్మడి జిల్లా నుంచి మంత్రిగా ఉన్నప్పుడు అన్నీతానై వ్యవహరించారు. కరీంనగర్ కేంద్రంగా ఆయన తన కార్యకలాపాలను కొనసాగించేవారు. గంగుల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నుంచి కరీంనగర్‌కు ఈటెల రాజేందర్ చాలా అరుదుగా వస్తున్నారు. సీఎం కేసీఆర్ రెండ్రోజుల కరీంనగర్ జిల్లా పర్యటన నేపథ్యంలో వీరిద్దరు ఒకే చోట కలిస్తే ఎలా ఉంటుందని అనుచరులు అనుకున్నారు. ఇద్దరిలో సీఎం ఎవరికి ప్రాధాన్యం ఇస్తారనే చర్చ సాగింది.

రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి కరీంనగర్ ‌జిల్లా నుంచి కొత్తగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు మంత్రిగా అవకాశం దక్కింది. అప్పటికే ఆ జిల్లా నుంచి ఈటెల రాజేందర్‌కు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉంది. గంగులకు మంత్రి పదవి ఇవ్వడంతో టీఆర్‌ఎస్‌లో ఈటెలకు ప్రాధాన్యం తగ్గిందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఈటెలతో సంబంధం లేకుండా గంగుల కమలాకర్ ఒక్కరే అభ్యర్థుల ఎంపికను పూర్తిచేశారు. కానీ, కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలో ఆయనకు కారు పార్టీ పెద్దలు షాక్ ఇచ్చారు. ముందు నుంచీ ఈటెల రాజేందర్ చెబుతున్న.. ప్రతిపాదించిన సునీల్‌రావు అనుహ్యంగా మేయర్ అయ్యారు. ఈ విషయం గంగుల నిర్ణయాన్ని పక్కన పెట్టారు. ఇక అప్పటి నుంచి సీఎం వద్ద మంత్రి గంగుల కమలాకర్‌కు అంతగా ప్రాధాన్యం లేదని ప్రచారం జోరుగా సాగుతోంది.

సీఎం కే చంద్రశేఖర్‌రావు వ్యూహాలు, ఆలోచనలను ఎవరికీ అంతు పట్టవు. బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు వచ్చే సమయంలో బీసీ సంక్షేమ మంత్రి గంగుల కమలాకర్‌ను తన వెంట తీసుకువచ్చారు. దీంతో ఆయన వర్గంలో సంతోషం వ్యక్తమైంది. తమ మంత్రికే సీఎం వద్ద ప్రాధాన్యం ఉందని అంతా సంబరపడిపోయారు. గురువారం కాళేశ్వరం సందర్శనకు సీఎం కేసీఆర్ వెళ్లినప్పుడు గంగులను కాకుండా మంత్రులు ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్‌ను తీసుకెళ్లారు. దీంతో ఆయన వర్గీయులు తమ మంత్రికి సీఎం వద్ద ప్రాధాన్యం తగ్గలేదని హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇరువర్గాలు ఎవరికివారు సీఎం దగ్గర తమ మంత్రులకు ప్రాధాన్యం ఉందని సంబరపడిపోతున్నారు. కానీ, ఇద్దరు మంత్రు ఎత్తులు సీఎం కేసీఆర్ ముందు చిత్తయ్యాయని ఉమ్మడి జిల్లాలో చర్చ జరుగుతోంది.

Next Story

Most Viewed