‘గౌడ కులస్తులకు కేసీఆర్ ఎంతో మేలు చేశారు’

by  |
‘గౌడ కులస్తులకు కేసీఆర్ ఎంతో మేలు చేశారు’
X

దిశ, క్రైమ్ బ్యూరో: ఉమ్మడి రాష్ట్రంలో కల్లు అమ్మకాలను నిషేదించిన నాటి పాలకులు గీత వృత్తిని అవమానించగా, స్వరాష్ట్రంలో గీత కార్మికుల సంక్షేమం, అభివృద్దికి సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన నీరా పాలసీని తీసుకొచ్చి గౌడ కులస్తులకు ఎంతో మేలు చేశారన్నారు. ఉప్పల్ భగాయత్‌లోని గౌడ హాస్టల్ భవనం భూమి పూజ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉమ్మడి రాష్ట్రంలో కుల వృత్తులు ధ్వంసం అయితే, సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యాప్తంగా కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి జరుగుతోందన్నారు. అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలకు ఎంతో విలువైన భూములను కేటాయించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది అన్నారు. హైదరాబాద్‌లో కల్లు అమ్మకాలకు అనుమతించి, గీత వృత్తిని ప్రోత్సహిస్తున్నారని అన్నారు.

అందులో భాగంగానే హరిత హారంలో 3.75 కోట్ల తాటి, ఈత మొక్కలను నాటినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గీత కార్మికుల బకాయిలను దాదాపు రూ.10 కోట్లను రద్దు చేశారన్నారు. అంతేగాకుండా, ప్రమాదవశాత్తు గీత కార్మికులు తాటి, ఈత చెట్లపై నుంచి పడిపోయి ప్రమాదాలకు గురైనవారికి ఎక్స్ గ్రేషియోను రూ.2 నుంచి రూ.5 లక్షలకు పెంచి గీత కార్మికులను ఆదుకుంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం తర్వాత రాష్ట్రంలోని ఈత, తాటి చెట్ల పన్నులను శాశ్వతంగా రద్దు చేసినట్టు గుర్తు చేశారు. బీసీ విద్యార్థులకు వందలాది గురుకుల పాఠశాలలను స్థాపించి, వారి విద్యాభివృద్దికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, మాజీ ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, మధు యాష్కీ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం గౌడ్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొన్నారు.


Next Story

Most Viewed