సడెన్‌గా కాన్వాయ్‌ని ఆపి.. పొలాల్లో ఉన్న రైతులతో మాట్లాడిన కేసీఆర్

by  |
Palli-KCR1
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: పంటల మార్పిడి వ్యవసాయం చేయడం ద్వారానే మంచి దిగుబడులు, లాభాలు ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు సూచించారు. గురువారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం రోడ్డు మార్గాన తిరుగు ప్రయాణమైన ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి జిల్లాలో 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న పొలాలను పరిశీలించారు. ముందుగా పెబ్బేరు మండలం శ్రీరంగాపూర్ లో రైతు రాములు సాగుచేసిన వేరుశనగ పంటను పరిశీలించారు. నేల నుండి వేరుశనగ చెట్లను తీసి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా రైతు రాములును గత ఏడాది ఏ పంట సాగు చేశావు.. ఎంత లాభం వచ్చింది.. ఇప్పుడు వేరుశనగ సాగుకు ఎకరాకు ఎంత ఖర్చు అయ్యింది? అని అడిగి తెలుసుకున్నారు. వరి సాగు కన్నా వేరుశనగ సాగుపై రైతు ఆసక్తి చూపినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం కొత్తకోట మండలం విలియం కొండ గ్రామం వద్ద మహేశ్వర్ రెడ్డి అనే రైతు సాగుచేసిన మినుముల సాగు పొలాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మినుములు సాగు జిల్లాలో ఎలా ఉందని మంత్రి నిరంజన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతుతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు రైతు కూలీలు ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఫొటోలు దిగారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్రమంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, జైపాల్ యాదవ్, వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషతోపాటు ఇతరులు ఉన్నారు.


Next Story

Most Viewed