శ్రీ‌వారిని ద‌ర్శించుకుని.. మొక్కు తీర్చుకున్న సీఎం జగన్

by  |
cm jagan
X

దిశ, రాయలసీమ: తిరుమ‌ల వెంకటేశ్వర‌స్వామివారిని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మంగ‌ళ‌వారం ఉద‌యం దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వ‌ద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కేఎస్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి సంప్రదాయ‌బ‌ద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి ద‌ర్శనం అనంతరం వకుళామాతను, ఆలయ ప్రదక్షణగా వచ్చి విమాన వెంకటేశ్వరస్వామి, సబేరా, భాష్యకార్ల సన్నిధి, యోగనరసింహస్వామివారిని దర్శించుకున్నారు.

తులాభారం మొక్కు తీర్చుకున్న సీఎం
శ్రీ‌వారి ద‌ర్శనం అనంత‌రం ముఖ్యమంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆల‌యంలోని తులాభారం మొక్కు తీర్చుకున్నారు. శ్రీ‌వారి అనుగ్రహంతో కోరిక‌లు తీరిన భ‌క్తులు త‌మ బ‌రువుకు స‌మానంగా బెల్లం లేదా బియ్యం లేదా ఇత‌ర ధాన్యాల‌తో తూకం వేసి స్వామివారికి స‌మ‌ర్పించ‌డం ఆనాదిగా వ‌స్తున్న సంప్రదాయం. ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి తన బరువుకు సమానంగా 78 కిలోల బియ్యం తులాభారంలో సమర్పించి మొక్కు చెల్లించారు.

సీఎం వెంట మంత్రులు పి. రామచంద్రారెడ్డి, వేణుగోపాల కృష్ణ, వి. శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ శ్రీ‌కాంత్ రెడ్డి, ఎంపీలు మిథున్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, గురుమూర్తి, ఎమ్మెల్యేలు కరుణాకర్ రెడ్డి, మ‌ధుసూద‌న్ రెడ్డి, బోర్డు సభ్యులు ప్రశాంతి రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, విశ్వనాథరెడ్డి, మధుసూదన్ యాదవ్, పోకల అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ హరినారాయణన్, డీఐజీ క్రాంతిరాణా టాటా, టీటీడీ సీవీఎస్వో గోపినాథ్ జెట్టి తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed