వారికి తక్కువ ధరతో ప్లాట్లు : జగన్

by  |
cm jagan
X

దిశ, ఏపీ బ్యూరో: అర్బన్​ప్రాంతాల్లోని మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు మరో అడుగు ముందుకు వేస్తున్నామని సీఎం జగన్​ అన్నారు. గురువారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో పురపాలక శాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వైఎస్సార్‌ హయాంలో రాజీవ్‌ స్వగృహ పేరిట గతంలో ఇళ్లు నిర్మించినట్లే ప్రభుత్వమే లే అవుట్లు ఏర్పాటు చేసి తేలికపాటి ధరలతో రిజిస్టర్​చేసి ఇవ్వాలని కోరారు. ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసి మధ్య తరగతి ప్రజలు సవాలక్ష ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. టైటిల్​డీడ్, డీటీపీసీ, ఇతర అనుమతుల్లేని ప్లాట్లు కొని అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. వీటిని నివారించేందుకు లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే అందుబాటులో ధరల్లో ప్లాట్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని సూచించారు. లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయిస్తే సరిపోతుందని చెప్పారు.

భీమిలి నుంచి భోగాపురందాకా బీచ్​రోడ్డు విస్తరణ

భీమిలి నుంచి భోగాపురం దాకా బీచ్​రోడ్డును ఆరు లైన్లుగా విస్తరించేందుకు పరిశీలించాలని సీఎం జగన్ ​అధికారులను ఆదేశించారు. ఈ రహదారిలో గోస్తనీ నదిపై సుందరమైన వంతెన చేపట్టాలని కోరారు. ఇది విశాఖకు తలమానికంగా నిలిచిపోతుందని చెప్పారు. దీనిపై సమగ్ర కార్యాచరణను చేపట్టాలని కోరారు. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అర్బన్​ప్రాంతాల్లో సాలిడ్​వేస్ట్ మేనేజ్​మెంటుపై దృష్టి సారించాలని సీఎం కోరారు. పట్టణ గృహ నిర్మాణ పథకాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. మొత్తం 17 వేల రెవెన్యూ గ్రామాలుంటే అర్బన్​లో 16వేల లే అవుట్లలో జగనన్న కాలనీలను నిర్మిస్తున్నామన్నారు. కాలనీల్లో అన్ని మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేయాలని కోరారు. ఆధునిక హంగులతో కాలనీలను వినూత్నంగా తీర్చి దిద్దాలని సీఎం అధికారులను ఆదేశించారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయాలని సూచించారు. దీనికి సంబంధించి రూ. వెయ్యి కోట్ల డీపీఆర్​ను త్వరగా ఆమోదించేట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్భన్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.


Next Story

Most Viewed