పెన్షన్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న సీఎం జగన్ : నారా లోకేశ్

by  |
పెన్షన్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న సీఎం జగన్ : నారా లోకేశ్
X

దిశ, ఏపీ బ్యూరో : జగన్ సర్కార్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలోనూ.. చివరికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనూ పెన్షన్ రూ.3000కి పెంచుకుంటూ పోతామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రూ.3000కు పెంచుకుంటూ పోతామని చెప్పి కేవలం రూ.250 వద్దే ఆగిపోయారని విమర్శించారు. వృద్ధులను ఇంకెంతకాలం మోసం చేస్తారు అని సీఎం జగన్‌ను ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. ఒకటో తేదీనే పెన్షన్ గడపకే ఇస్తామన్న ప్రగల్భాలు ఏమయ్యాయని నిలదీశారు.

“ప్రతి నెలా సాంకేతిక సమస్యలేనా? లేక, అప్పు దొరకడంలేదా? మీకు ఇవ్వాలనే మనుసుండాలి కానీ, మీవద్ద లక్షల కోట్లు మూలుగుతున్నాయి. వాళ్లనీ, వీళ్లనీ అప్పులు అడగడం బాగాలేదు. ఒక్క నెల జే ట్యాక్స్ లో 10 శాతం వెచ్చిస్తే రాష్ట్రంలో అందరికీ పెన్షన్లు ఇవ్వొచ్చు. క్విడ్ ప్రో కో ద్వారా కూడగట్టిన అక్రమాస్తుల్లో 1 శాతం అమ్మితే ఏపీ అప్పులన్నీ తీరిపోతాయి. పింఛన్లు ఆలస్యం చేస్తే పెంపు గురించి అడగరన్న లాజిక్‌తో పింఛన్ ఇచ్చే ఒకటో తేదీని అలా పెంచుకుంటూ పోతున్నారా జగన్ రెడ్డి” అంటూ లోకేశ్ సెటైర్లు వేశారు.

సీఎం జగన్‌కు వైసీపీ సెక్షన్లు వర్తించవా పోలీస్ దొర..

మాస్కు ధరించలేదని చీరాలలో దళిత యువకుడు కిరణ్ కుమార్‌ను పోలీసులు కొట్టి చంపి ఏడాది దాటిందని లోకేశ్ గుర్తు చేశారు. నిందితులపై ఇప్పటికీ చర్యలు లేవన్నారు. మాస్కు పెట్టుకోని వాళ్లను కొట్టి చంపాలని జగన్ సర్కారు చెబుతోందని అర్థం చేసుకున్నారేమో అంటూ సెటైర్లు వేశారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదూరుపల్లి సెంటర్‌లో మాస్కు ధరించని వ్యక్తిని కొడుతూ, కాలితో తన్నుతూ సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించిన ఎస్ఐపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. అంటే ఏపీలో వైసీపీ సెక్షన్ ప్రకారం మాస్కు లేకపోవడం చంపేసేంత నేరమైతే, సీఎం ఏ ఒక్క రోజు కూడా మాస్కు ధరించడని, ఆయనకి వైసీపీ సెక్షన్లు వర్తించవా పోలీస్ దొరా? అంటూ నారా లోకేశ్ ప్రశ్నించారు.



Next Story

Most Viewed