తక్షణమే వారికి రూ.1000సాయం చేయండి: సీఎం జగన్

by  |
తక్షణమే వారికి రూ.1000సాయం చేయండి: సీఎం జగన్
X

దిశ, ఏపీ బ్యూరో: తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్రమత్తమయ్యారు. తుఫాను ప్రభావిత జిల్లాలైన ప్రకాశం, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు, చిత్తూరు, వైయస్సార్‌ కడప జిల్లాల కలెక్టర్లు, అధికారులతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అలాగే సహాయక శిబిరాల్లో ఉంటున్న బాధితులకు తక్షణమే రూ.1000చొప్పున ఆర్థిక సహాయం అందించాలని సీఎం ఆదేశించారు. అలాగే ఇప్పటికే ఆయా ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించినట్లు తెలిపారు. విద్యుత్, ఇరిగేషన్, రెవెన్యూశాఖల అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.

కలెక్టర్లకు కీలక ఆదేశాలు..

వాయుగుండం ప్రభావంతో రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. ముఖ్యంగా తమిళనాడు సరిహద్దుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆయా ప్రాంతాలకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఇప్పటికే చేరుకున్నాయని ఆయన తెలిపారు. వాటిలో 2 బృందాలు ఇప్పటికే నెల్లూరు, మరో 2 బృందాలు చిత్తూరుకు చేరుకున్నాయని, కర్నూలులో మరో 2 బృందాలు సిద్ధంగా ఉన్నాయని జగన్ తెలిపారు. మంగళగిరిలో కూడా అదనపు బృందాలను సిద్ధం చేశామని, పరిస్థితులను బట్టి వారి సేవలను వినియోగించుకోవచ్చు అని సీఎం జగన్ స్పష్టం చేశారు.

సహాయ పునరావాస కేంద్రాలు..

‘అవసరమైన చోట సహాయ శిబిరాలు తెరవండి. సహాయ శిబిరాల్లో ఉంచిన వారికి మంచి ఆహారంతోపాటు బాధితులకు రూ.1000చొప్పున పరిహారం అందించాలి’ అని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘ముంపు ప్రాంతాలనుంచి ప్రజలను తరలించేలా చర్యలు తీసుకోండి. అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోండి. పీహెచ్‌సీల్లో, ఏరియా ఆస్పత్రుల్లో, జిల్లా ఆస్పత్రుల్లో అన్నిరకాల మందులను ఉండేలా చర్యలు తీసుకోండి. వర్షాల అనంతరం కూడా పారిశుద్ధ్యం విషయంలో చర్యలు తీసుకోండి. అత్యవసర సేవలకు అంతరాయం రాకుండా జనరేటర్లను వినియోగించండి. విద్యుత్‌స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతింటే.. వెంటనే వాటిని ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి’ అని సీఎం అధికారులను ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునేలా విద్యుత్‌శాఖ అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి..

‘సహాయక శిబిరాల్లో ఉంటున్న బాధితులకు ఆహారం, తాగునీటి ప్యాకెట్లను పంపిణీ చేయండి. భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్లు, చెరువులు, గండ్లు పడకుండా తగిన చర్యలు తీసుకోండి. నీటి పారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండండి. వర్షాలను, నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ.. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా నీటిని విడుదల చేయాలి. రోడ్లు ఇతరత్రా మౌలిక సదుపాయాలకు ఎక్కడ నష్టం వాటిల్లినా వెంటనే మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోండి. తీవ్ర ప్రభావిత మండలాల్లో అగ్నిమాపక కేంద్రాలను, సిబ్బంది సేవలను వినియోగించుకోండి. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనావేస్తూ… ఆ వివరాలను వెంటనే పంపించండి. ఫోన్‌కాల్‌కు మేం అందుబాటులో ఉంటాం.. ఇంకా ఏం కావాలన్నా వెంటనే తెలియజేయండి’ అని అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉపముఖ్యమంత్రి (మైనార్టీశాఖ) ఎస్‌ బి అంజాద్‌ బాషా, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి వి ఉషారాణి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed