మావోయిజం నిర్మూలనకు పంచ ప్రణాళిక..

by  |
మావోయిజం నిర్మూలనకు పంచ ప్రణాళిక..
X

దిశ, వెబ్‌డెస్క్ : మావోయిజాన్ని అధిగమించాలంటే ఐదు అంశాల ప్రణాళికను అమలు చేస్తే చాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఛత్తీస్‌గడ్ సీఎం భూపేశ్ భగేల్ సూచించారు. రాష్ట్రంలో ఉపాధి కల్పనకు, నక్సలైట్ల ప్రభావిత బస్తర్ రీజియన్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఓ లేఖలో కోరారు. బస్తర్‌ ప్రాంతంలో మావోయిజాన్ని నిర్మూలించాలంటే ఫైవ్ పాయింట్స్ ప్లాన్‌ను తప్పక అమలు చేయాలని పేర్కొన్నారు. మావోయిస్టుల్లో చేరకుండా యువతను అడ్డుకోవడానికి పెద్దమొత్తంలో ఉపాధిని కల్పించాలన్నారు. బస్తర్ రీజియన్‌లో ఉక్కు ఖనిజాలు అపారంగా ఉన్నాయని, ఇక్కడ స్టీల్ ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తే 30 శాతం డిస్కౌంట్‌తో ఉక్కు అందించే నిర్ణయాన్ని ప్రకటిస్తే రూ.కోట్ల పెట్టుబడులు ప్రత్యక్ష, పరోక్ష మార్గాల్లో వచ్చి చేరుతాయని అభిప్రాయపడ్డారు.

అలాగే, పవర్ గ్రిడ్‌ల నుంచి మారుమూల ప్రాంతాలకు విద్యుత్ అందడం లేదని, కావున ఆ ఏరియాల్లో అవసరం మేరకు సోలార్ పవర్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిర్ణయం ఆర్థిక వ్యవస్థకూ కలిసొస్తుందని వివరించారు. బస్తర్ అడవుల్లో అపారమైన అటవీ సంపద, వైద్య మూలికలు ఉన్నాయని.. వాటిని వాణిజ్యం చేసుకోవడం కుదరడం లేదని లేఖలో పేర్కొన్నారు. ఈ సంపదను ప్రాసెస్ చేసి సేల్ చేయడానికి అనుగుణమైన కోల్డ్ చైన్ సహా ఇతర వసతులను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, బోద్‌ఘాట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు గ్రాంట్లు విడుదల చేయాలని అభ్యర్థించారు. మావోయిస్టులను ఎదుర్కొనే విషయమై ఇదివరకే సీఎం భగేల్ నవంబర్ 12న లేఖ రాయగా, తాజాగా రెండోసారి కూడా లేఖ రాశారు.

Next Story