తరగతి గదిలో 50 శాతం విద్యార్థులకే అనుమతి: సబిత

by  |
తరగతి గదిలో 50 శాతం విద్యార్థులకే అనుమతి: సబిత
X

దిశ, క్రైమ్ బ్యూరో : రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభం కానున్న నేపథ్యంలో డిగ్రీ, పీజీ, వృత్తి విద్య కోర్సుల్లో తరగతి గదిలో 50 శాతం విద్యార్థులను మాత్రమే అనుమతించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నత విద్యా మండలి అధికారులను ఆదేశించారు. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగానే తరగతి గదులను నిర్వహించాలని అన్నారు. ఉన్నత విద్యా మండలి అధికారులతో శుక్రవారం ఆమె కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

మంత్రి సబిత ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… ప్రతీ కళాశాల తరగతుల వారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని అమలు చేయాలన్నారు. ప్రతి నిత్యం శానిటైజేషన్ ప్రక్రియను చేపట్టేందుకు ప్రతి యూనివర్శిటీకి రూ.20 లక్షలను తక్షణ సాయం అందించాలని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డిని ఆదేశించారు. కళాశాలల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున గుమిగూడకుండా యాజమాన్యాలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా చూడాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వం సూచించిన కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేస్తున్నాయా.. లేదా అనే విషయాలను తనిఖీ చేయాలన్నారు.

Next Story