ఆ నియోజకవర్గ టీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు

by  |
ఆ నియోజకవర్గ టీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజక వర్గ టీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే జాజాల సురేందర్​వర్సెస్​మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డి మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే చెప్పినట్లే నడుస్తుండడంతో ఏళ్ల తరబడి ఏనుగు వెంట ఉన్న కేడర్​జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే జాజాల వెంట రవీందర్​రెడ్డి అనుచరులైన ప్రజాప్రతినిధులు తప్పనిసరి పరిస్థితుల్లో తిరుగుతున్నారని, లేకపోతే ఎక్కడ స్థానిక సంస్థల నిధులు, ప్రభుత్వం చేపట్టిన నిధుల పంపిణీలో కోత ఉంటుందనే కుక్కిన పేనులా ఉండాల్సి వస్తోందని వారు వాపోతున్నట్లు తెలుస్తోంది. రైతు వేదికలు, కల్లాల నిర్మాణం, గ్రామాల్లో ప్రభుత్వ నిధుల కేటాయింపులో ఏనుగు ఆదేశాలకు విలువలేదని ఆయన అనుచరులు కొందరు బాహాటంగానే విమర్శిస్తున్నారు. రెండేళ్ల కాలంలో తొలి ఏడాది వరకు మంచిగానే ఉన్న వారి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయని, ఇటీవల వారివారి అనుచరులు సోషల్​మీడియాలో చేస్తున్న కామెంట్లు ఇబ్బందికరంగా పరిణమించాయి.

కాంగ్రెస్​ నుంచి గెలిచి టీఆర్‌‌ఎస్‌లో చేరిన జాజాల

ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి టీఆర్​ఎస్​పార్టీలో చేరిన ఏనుగు రవీందర్​రెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సీనియర్​నేత. మూడు పర్యాయాలు పోటీ చేసిన ఏనుగు గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జనార్ధన్ గౌడ్, షబ్బీర్​ఆలీ, జాజాల సురేందర్​ను ఓడించి హాట్రిక్ సాధించాడు. కానీ, 2018 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జాజాల సురేందర్​చేతిలో ఓటమి పాలయ్యారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 8 మంది టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లు గెలిస్తే కాంగ్రెస్ నుంచి ఒక్క ఎల్లారెడ్డి స్థానం నుంచి జాజాల సురేందర్ గెలిచి ఉనికి చాటారు. కానీ, టీఆర్ఎస్ చేపట్టిన ఆకర్ష్ లో భాగంగా సురేందర్​కాంగ్రెస్​ను వీడి టీఆర్ఎస్ లో చేరారు. నిజామాబాద్ స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల తరువాత ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ కేడర్​చాలా వరకు జాజాల వెంటే నడిచింది. అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీఎం కేసీఆర్​అన్ని అధికారులు అప్పగించగా, అప్పటినుంచి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డికి మింగుడు పడడం లేదు.

తాజా, మాజీల మధ్య దూరం..

కరోనా నేపథ్యంలో నియోజక వర్గ ప్రజలకు చేరువ కాలేదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే జాజాల పాదయాత్ర చేపట్టారు. కానీ, ఇటీవల నియోజకవర్గంలో జరిగిన రెండు మూడు పరిణామాలు తాజా, మాజీల ఎమ్మెల్యేల మధ్య దూరం పెంచిందని చెప్పవచ్చు. అధికారిక వేదికల సాక్షిగా జరిగిన గొడవలు ముదిరి పాకాన పడ్డాయి. అదే సమయంలో ఏనుగు రవీందర్​రెడ్డి తన కేడర్​ను కాపాడుకుంటూనే రెడ్డి లాబీయింగ్​ద్వారా భవిష్యత్​లో టికెట్ దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాడని సమాచారం. అదీ ఓ మంత్రి ద్వారా పార్టీ అధిష్టానానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడని నియోజకవర్గ ప్రజలు చెబుకుంటున్నారు.

జాజాల సురేందర్​సైతం తన వర్గాన్ని బలోపేతం చేసుకుంటునే పార్టీలో బలం పెంచుకునేందుకు అడుగులు వేస్తున్నాడని అందరూ చర్చించుకుంటున్నారు. తనకు సీఎం కేసీఆర్​తో ఉన్న సాన్నిహిత్యంతో పవర్ పాలిటిక్స్ ను ఉపయోగించి బలపడేందుకు కసరత్తు చేస్తున్నాడని చెప్పవచ్చు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం రెండు కత్తులు ఒక ఒరలో ఇముడలేని పరిస్థితి నెలకొంది.

Next Story

Most Viewed