వేములవాడ టీఆర్‌‌ఎస్‌లో ముసలం

by  |
వేములవాడ టీఆర్‌‌ఎస్‌లో ముసలం
X

దిశ, వేములవాడ: సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ టీఆర్ఎస్‌లో ముసలం మొదలైంది. వైస్ చైర్మన్ మధు రాజేందర్ రాజీనామా చేయడంతో పాలకవర్గంలో వర్గ విభేదాలు బహిర్గతం అయ్యాయి. టీఆర్‌ఎస్, బీజేపీ కౌన్సిలర్లు ఒక్కటై తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. చైర్ పర్సన్, వైస్ చైర్మన్ మధ్య కొంత కాలంగా ఆధిపత్య పోరు నడుస్తుండగా వైస్ చైర్మన్ రాజీనామాతో జిల్లాలో తీవ్ర చర్చనీయాంశం అయింది.

ఏడాది గడవకముందే..

వేములవాడ మున్సిపాలిటీలో పాలకవర్గం ఏర్పాటై ఏడాది గడవక ముందే విభేదాలు బహిర్గతం అయ్యాయి. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇలాఖా సిరిసిల్ల జిల్లాలోనే ఇలాంటి ఘటన జరగడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. రెండు నెలలుగా వర్గపోరు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది.

వేములవాడ మున్సిపాలిటీలోని టీఆర్ఎస్‌లో విభేదాలు బహిర్గతం అయ్యాయి. కమిషనర్ శ్రీనివాస రెడ్డికి వైస్ చైర్మన్ మధు రాజేందర్ శుక్రవారం రాజీనామా పత్రం ఇవ్వడంతో తీవ్ర చర్చనీయాంశం అయింది. కొంత కాలంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ రెండు వర్గాలుగా విడిపోయాయి. గత మున్సిపల్ సమావేశంలో వారిద్దరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. వైస్ చైర్మన్ సమావేశం స్టేజీపై కూర్చోవడాన్ని బీజేపీ కౌన్సిలర్లు వ్యతిరేకించారు. కానీ సపోర్ట్ చేయాల్సిన టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు, బీజేపీకే మద్దతు నిలిచినట్లు వ్యవహరించారు. దీంతో మనస్థాపానికి గురైన మధురాజేందర్ కౌన్సిలర్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతరం సమావేశం నుంచి వాక్‌ అవుట్ చేశారు.

ప్రోటోకాల్ వివాదం..

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమంలో మరోసారి ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. కౌన్సిలర్లు బాహాబాహీకి దిగడం, వైస్ చైర్మన్‌పై దాడి కూడా జరిగింది. మనస్తాపానికి గురైన ఆయన మున్సిపల్ కార్యక్రమాలకు, పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే రమేశ్ బాబు అందుబాటులో లేకపోవడంతో పార్టీలో విభేదాలు ఒక్కోక్కటిగా బయటకు వస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో వైస్ చైర్మన్ గా మధు రాజేందర్ చేసిన సేవలు ప్రజలు కొనియాడుతున్నారు. మున్సిపల్ వేదికగా జరుగుతున్న ఇలాంటి పరిణామాలు ప్రజలు గమనిస్తున్నారు.

వైస్ చైర్మన్ బాటలో మరికొందరు..!

వేములవాడ మున్సిపల్‌లో ముదిరిన వివాదం వైస్ చైర్మన్ మధు రాజేందర్ రాజీనామా వరకు వెళ్లింది. దీంతో అదే బాటలో మరో ఐదుగురు కౌన్సిలర్లు కూడా రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీలో విభేదాలు బహిర్గతం కావడంతపై పట్టణంలో చర్చనీయాంశమైంది.

లాక్‌డౌన్‌లో అన్నదానం..

లాక్ డౌన్ సమయంలో వైస్ చైర్మన్ మధు రాజేందర్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైస్ చైర్మన్, మున్సిపల్ చైర్ పర్సన్‌కు సమా చారం లేకుండానే స్వతహాగా నిర్వహించడం, మున్సిపల్ నుంచి అందిస్తున్న రూ.5 భోజనం సైతం ఆయన మొదట్లో పేదలకు ఉచితంగా పంచడం వెనుక విభేదాలు పుట్టుకొచ్చాయి.



Next Story