కేటీఆర్ సమక్షంలో మైనంపల్లి వర్సెస్ వేముల

by  |
కేటీఆర్ సమక్షంలో మైనంపల్లి వర్సెస్ వేముల
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: అధికార పార్టీలో ఆధిపత్య పోరు మరోసారి బయటపడింది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో ఇటీవల నిర్వహించిన ఒక కార్యక్రమం సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మధ్య మనస్పర్థాలు ఏర్పడి ఆ లొల్లిపై పరస్పరం అధిష్ఠానానికి ఫిర్యాదు చేసుకునేంత వరకు వెళ్లింది. ఇది ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నిజామాబాద్ జిల్లాలోని నవిపేట్ మండలం జన్నపల్లి గ్రామంలో ఈ నెల ఒకటో తేదీన పురాతన శివాలయం పున:ప్రారంభావాన్ని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరు కాగా, ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యేలు షకీల్, జీవన్ రెడ్డి, గణేష్ గుప్తా, ఎమ్మెల్సీ ఆకుల లలిత, దయానంద్‌తో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు.

హైదరాబాద్ బోయిన్‌పల్లి నుంచి నిజామాబాద్ వరకు వందల కార్లు, వేల బైక్‌లతో అట్టహాసంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ర్యాలీ నిర్వహించడం జిల్లాలోనే చర్చనీయాంశంగా మారింది. అయితే ఇంతటి కార్యక్రమం తన పరిధిలోని నిజామాబాద్ జిల్లాలో నిర్వహించి, ప్రొటోకాల్ లేకుండా, మంత్రినని చూడకుండా, తనకు సమాచారం ఇవ్వకుండా ఎలా నిర్వహిస్తారని శుక్రవారం మైనంపల్లిని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించినట్లు తెలిసింది. దానికి సమాధానంగా అదే విషయం కోసం తాను సీనియర్ ఎమ్మెల్యేనని చూడకుండా మంత్రికి నాలుగుసార్లు ఫోన్ చేసినా స్పందించలేదని, తన సొంత ఖర్చులతో కార్యక్రమాన్ని నిర్వహించానని, ఇప్పుడు తనకు సమాచారం ఇవ్వలేదనడం సరికాదని మైనంపల్లి గట్టిగానే చెప్పినట్లు సమాచారం. హైద్రాబాద్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలోనే వారి ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగినట్లు తెలిసింది. అంతేకాకుండా వారు ఒకరిపై మరొకరు అధిష్ఠానానికి ఫిర్యాదు కూడా చేసుకోవడం సర్వత్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో అధికార పార్టీలోని గ్రూప్ రాజకీయం మరోసారి తేటతెల్లమైందని పలువురు చర్చించుకుంటున్నారు.


Next Story

Most Viewed