సభలో రసాభాస.. ఎమ్మెల్యే సాక్షిగా రైతులపై రెచ్చిపోయిన సర్పంచులు

by  |
godava1
X

దిశ, ఇబ్రహీంపట్నం: యాసంగి వరిసాగుకు బదులు ప్రత్యామ్నాయ పంటలు వెయ్యాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రైతులకు సూచించారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో గురువారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రైతులు ఎవ్వరు కూడా ఈ సారి వరి పంట సాగుచేయొద్దన్నారు. పప్పు దినుసుల పంటలు, పండ్ల పెంపకం, పూలతోటల వంటి వాటిని వేసి అధిక దిగుబడి రాబట్టి లబ్ధి పొందాలన్నారు. ఈ సందర్భంగా సభలో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. ప్రజాప్రతినిధులకు, రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే సాక్షిగా సర్పంచులు రెచ్చిపోయి, రైతులపైకి బాహాబాహీగా దూసుకుపోయారు.

యాచారం ఎంపీపీ కొప్పు సుఖన్య మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు రైతులకు లేనిపోనివి అపోహలు కల్పించి భయాందోళనకు గురిచేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వంపై లేనిపోని చెప్పి రైతులను తప్పుదోవ పట్టించడం సరికాదని ఎద్దేవా చేశారు. ముందు రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొంటారా కొనరో సమాధానం చెప్పాలని అని నిలదీశారు. రైతులను మోసం చేసే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆమె అన్నారు. ఎంపీటీసీ ఆంజనేయులు మాట్లాడుతూ రైతులకు అనేక సమస్యలు ఉన్నాయని, తమ ప్రాంతంలో సన్న ఒడ్లు కొనడం లేదని, రుణమాఫీ కూడా అతికొద్ది మంది మాత్రమే లబ్ధి పొందుతున్నారని, రైతులందరూ లబ్ధి పొందేలా చూడాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏడివో సత్యనారాయణ, హెచ్ వో కనకమహాలక్ష్మి, ఏవో సందీప్, రైతు సమన్వయ కమిటీ లక్ష్మారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు టేకుల సుదర్శన్ రెడ్డి, పుల్లారెడ్డి, రాజేందర్ రెడ్డి, వివిధ మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ డైరెక్టర్లు, వార్డు మెంబర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Next Story