ఏడేళ్ల నుంచి నయాపైసా పెరగలేదు : సీఐటీయూ

by  |
CITU
X

దిశ, సంగారెడ్డి: తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడి ఏడేండ్లు గడుస్తున్నా.. కార్మికుల కనీస వేతనాల పెంచకుండా, జీవోలను సవరించకుండా నిర్లక్ష్యం చేస్తోందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు రూ. 20 వేలకు పెంచాలని కోరారు. మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో సదాశివపేట పట్టణంలో సీఐటీయూ నేతలు సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ.. ఇప్పటికే కరోనా మహమ్మారితో ప్రజల జీవితాలు అతలాకుతలమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచడంతో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులపై పెను భారం పడుతోందని అన్నారు. ఇంతకీ టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల పక్షమా? లేదా యజమానుల పక్షమా? అని ప్రశ్నించారు. ఫైనల్ నోటిఫికేషన్‌లో ఇచ్చిన ఐదు రకాల జీవోలకు వెంటనే గెజిట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో నాయకులు నర్సింలు, సంతోష్ కుమార్, కృష్ణమూర్తి, రాజు, శేఖర్, శ్రీనివాస్ మూర్తి, సతీష్, వేణుగోపాల్, మల్లేశం, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed