మరో అర్థవంతమైన కథతో రాబోతున్న వేణు ఊడుగుల.. తెలుగోళ్లకు బంపర్ ఆఫర్ అంటూ ప్రకటన

by Mallepaka Hamsa |   (  Updated:2026-06-02 10:05:16  IST  )

భారతీయ కథల్లో అన్నదమ్ముల మధ్య విభేదాలు అనేవి కొత్తవి కావు. కానీ ఒక కుటుంబం చీలిపోతే నిజంగా ఓడేది ఆ కుటుంబమేనా? లేక ఆ ఊరంతా? అనే ఒక బలమైన ప్రశ్న నుంచి పుట్టిన కథే ఇది..

మరో అర్థవంతమైన కథతో రాబోతున్న వేణు ఊడుగుల.. తెలుగోళ్లకు బంపర్ ఆఫర్ అంటూ ప్రకటన
X

దిశ, సినిమా: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత వేణు ఊడుగుల సమాజానికి ఉపయోగపడే అర్థవంతమైన కథలతో ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. ‘నీది నాదీ ఒకే కథ’ సినిమాతో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమైన ఆయన, ఆ తర్వాత రానా దగ్గుబాటి, సాయి పల్లవి కాంబినేషన్‌లో ‘విరాటపర్వం’ వంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఆయన గత ఏడాది ‘రాజు వెడ్స్ రాంబాయి’ అనే చిత్రాన్ని మాన్‌సూన్స్ టేల్స్ బ్యానర్‌పై నిర్మించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆ సినిమాతో నిర్మాతగా మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన వేణు, తాజాగా తన తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

వేణు ఊడుగుల తన ట్విట్టర్ ద్వారా ఈ కొత్త సినిమా వివరాలను పంచుకుంటూ ఒక ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. "రాజు Weds రాంబాయి తర్వాత.. మరో అర్థవంతమైన కథతో మీ ముందుకు వస్తున్నాం. భారతీయ కథల్లో అన్నదమ్ముల మధ్య విభేదాలు అనేవి కొత్తవి కావు. కానీ ఒక కుటుంబం చీలిపోతే నిజంగా ఓడేది ఆ కుటుంబమేనా? లేక ఆ ఊరంతా? అనే ఒక బలమైన ప్రశ్న నుంచి పుట్టిన కథే ఇది.. అన్నదమ్ముల పంచాయితీ. ఆ రోజు ఎవరు గెలిచారో తెలియదు కానీ ఊరు మాత్రం ఓడిపోయింది. అన్నదమ్ములు అంటే రామలక్ష్మణుల్లా కలిసి ఉండే రామాయణం రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు రక్తం పంచుకున్నవాళ్లే గొడ్డళ్లు పట్టుకునే మహాభారతం నడుస్తోంది. మా ఊరు జమ్మికుంట మట్టి సాక్షిగా.. ఇద్దరు అన్నదమ్ముల పంచాయితీ, వాళ్ల ఇళ్లనే కాదు.. మా ఊరి రాతనే మార్చేసింది. ఇది ఏ ఇంట్లోనూ జరగకూడని కథ.

పిల్లలు, పెద్దలు, తాతలు, అమ్మలు, అక్కలు, చెల్లెళ్లు అందరూ బయల్దేరండి.. ఆ అన్నదమ్ముల పంచాయితీ ఏంటో చూద్దాం" అంటూ ఆసక్తికరంగా రాసుకొచ్చారు. నిజమైన కథ ఆధారంగా రాబోతుంది. వేణు ఊడుగుల అందించిన ఈ కథతో ‘ప్రొడక్షన్ నంబర్-2’గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మధుకర్ రెడ్డి కోమిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేణు ఊడుగుల, సంధ్య భాను చల్లా కలిసి డోలా ముఖి ఫిలిమ్స్, ఆరాధ్య సినీ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జమ్మికుంట నేపథ్యంలో సాగే ఒక యదార్థ గాథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. వేణు ఊడుగుల మళ్లీ ఒక గ్రామీణ నేపథ్యం ఉన్న ఎమోషనల్ సబ్జెక్ట్‌తో వస్తుండటంతో ఈ సినిమాపై సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా తెలంగాణ యాస వచ్చినవాళ్లకు ఇందులో నటించే చాన్స్ కూడా ఇచ్చారు. [email protected] 8096411437నంబర్‌కు వీడియోలు పంపాలని వెల్లడించారు.




Next Story