ఎగ్జిబిటర్ల పర్సంటేజీల వ్యవహారం.. ఎట్టకేలకు సబ్ కమిటీ ఏర్పాటు

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-17 15:45:01  IST  )

తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో థియేటర్ల పర్సంటేజీ వివాదంపై కీలక సమావేశం ముగిసింది.

ఎగ్జిబిటర్ల పర్సంటేజీల వ్యవహారం.. ఎట్టకేలకు సబ్ కమిటీ ఏర్పాటు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో థియేటర్ల యజమానులు, నిర్మాతలకు మధ్య కొంతకాలంగా నలుగుతున్న పర్సంటేజీ విధానం వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (Telugu Film Chamber of Commerce) కీలక అడుగు వేసింది. ఇవాళ హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో కూడిన అత్యున్నత స్థాయి కీలక సమావేశం ముగిసింది. ఎగ్జిబిటర్ల సెక్టార్‌కు సంబంధించిన పర్సంటేజీల వ్యవహారాన్ని వీలైనంత వేగంగా, అందరికీ ఆమోదయోగ్యంగా తేల్చేందుకు ఫిల్మ్ ఛాంబర్ ఓ ప్రత్యేక సబ్‌-కమిటీని (Sub-Committee) ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సబ్‌ కమిటీ చైర్మన్‌గా ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు , కన్వీనర్లుగా నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, సభ్యులుగా కే.ఎల్.నారాయణ, కె.అశోక్ కుమార్‌‌లను నియమించారు.

అయితే, ఈ సబ్ కమిటీలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అంటూ మొత్తం మూడు రంగాల ప్రతినిధులకు సమాన ప్రాధాన్యం కల్పించారు. థియేటర్ల నిర్వహణ ఖర్చులు, టికెట్ రెవెన్యూ షేరింగ్‌ (Ticket Revenue Sharing)పై ఈ కమిటీ అన్ని అంశాలపై చర్చించి, అభిప్రాయాలు సేకరించి త్వరలోనే ఓ తుది నివేదికను ఫిల్మ్ ఛాంబర్‌కు సమర్పించనుంది. దీంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అంతర్గత సమస్యలు సామరస్యంగా ముగిసిపోతాయని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Next Story