అభిమానుల కోసం రక్తం చిందించడానికైనా సిద్ధం.. ‘పెద్ది’ ఈవెంట్‌లో రామ్ చరణ్ ఎమోషనల్

by Ramesh Naini |

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ పాన్-ఇండియా చిత్రం జూన్ 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అభిమానుల కోసం రక్తం చిందించడానికైనా సిద్ధం.. ‘పెద్ది’ ఈవెంట్‌లో రామ్ చరణ్ ఎమోషనల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ పాన్-ఇండియా చిత్రం జూన్ 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోమవారం విజయవాడలో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో రామ్ చరణ్ అభిమానులను ఉద్దేశించి అత్యంత భావోద్వేగంగా మాట్లాడారు.

నా సినీ లైబ్రరీలో ‘పెద్ది’ టాప్‌లో ఉంటుంది

‘మీ అభిమానమే నా బలం. మీ కోసం చేతులు విరగ్గొట్టుకోవడమే కాదు, రక్తం చిందించడానికైనా సిద్ధం. చనిపోయే వరకు మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాను’ అని చరణ్ స్పష్టం చేశారు. ‘మగధీర’, ‘రంగస్థలం’, ‘RRR’ చిత్రాల తర్వాత ప్రతిరోజూ షూటింగ్‌కు ఎప్పుడు వెళ్దామా అనే క్యూరియాసిటీ కలిగించిన సినిమా ఇదని చరణ్ అన్నారు. నాన్న (చిరంజీవి) చెప్పినట్లు ఇలాంటి అద్భుతమైన కథలు పదేళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయని, తన లైఫ్‌లాంగ్ సినీ లైబ్రరీలో ‘పెద్ది’ ఎప్పటికీ టాప్ ఫిల్మ్‌గా నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కథను తన వద్దకు తెచ్చిన దర్శకుడు సుకుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఇండియాలోనే టాప్ 3 లేదా 4 డైరెక్టర్ల లిస్ట్‌లో బుచ్చిబాబు పేరు ఖచ్చితంగా ఉంటుందని చరణ్ బల్లగుద్ది మరీ చెప్పారు.

ఇది ఆటంకాలకు ఆగిపోయే కుర్రాడి కథ కాదు

‘ఉప్పెన’ వచ్చిన ఐదేళ్ల తర్వాత మళ్లీ సినిమా చేయడానికి ‘పెద్ది’ కథే కారణమని దర్శకుడు బుచ్చిబాబు తెలిపారు. చరణ్ కథ విని ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండా ఓకే చేశారని గుర్తుచేసుకున్నారు. ఇదొక ఆటగాడి జీవితమని, పడి లేచిన ఒక మనిషి ప్రయాణమని పేర్కొన్నారు. పోస్ట్ ప్రొడక్షన్‌లో ఈ సినిమాను 50 సార్లకు పైగా చూశానని, క్లైమాక్స్ చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవని బుచ్చిబాబు భావోద్వేగానికి లోనయ్యారు.

Next Story