- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అట్టహాసంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం.. ‘పద్మశ్రీ’ అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీమోహన్
రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

దిశ, వెబ్డెస్క్: రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేదికగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతోంది. వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన ప్రముఖులకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ అత్యున్నత పౌర పురస్కారాలను అందజేస్తున్నారు. పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా మంగళవారం జరిగిన రెండో విడత కార్యక్రమంలో మొత్తం 47 మందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మశ్రీ పురస్కారాలను ప్రదానం చేశారు. కాగా, అంతకుముందు మే 25న నిర్వహించిన మొదటి విడత కార్యక్రమంలో 66 మందికి పద్మ అవార్డులను అందజేసిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ ప్రముఖులకు ‘పద్మశ్రీ’..
ఇవాళ రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న వారిలో తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖ నటులు, నిర్మాతలు అయిన రాజేంద్రప్రసాద్, మురళీమోహన్ ఉన్నారు. కళారంగానికి వారు చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాలను ప్రకటించింది. రాష్ట్రపతి చేతుల మీదుగా వారు ఇరువురు అవార్డును తీసుకుంటున్న సమయంలో హాల్ అంతా చప్పట్లతో మారుమోగింది. అదేవిధంగా మళయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి సూపర్ స్టార్ మమ్ముట్టి పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.






