వివాదాలకు ఇక ఎండ్ కార్డ్.. సీఎంతో సినీ పెద్దల భేటీకి ముహూర్తం ఫిక్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-12 05:27:35  IST  )

తెలుగు మూవీ ఇండస్ట్రీలో థియేటర్ల బంద్ అంశం టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం తెలిసిందే.

వివాదాలకు ఇక ఎండ్ కార్డ్.. సీఎంతో సినీ పెద్దల భేటీకి ముహూర్తం ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు మూవీ ఇండస్ట్రీలో థియేటర్ల బంద్ అంశం టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం తెలిసిందే. తమ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో జూన్‌ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను మూసేస్తామని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హెచ్చరికలు జారీ చేశారు. ఆ తదనంతర పరిణామాలు, ఫిల్మ్‌ ఛాంబర్‌లో జరిగిన సమావేశం తర్వాత థియేటర్ల బంద్ లేదని ప్రకటన వెలువడింది. అయితే, స్వయంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) విడుదలకు ముందే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం ఆయనకు కోపం తెప్పించింది.

ఈ క్రమంలోనే చలనచిత్ర పరిశ్రమ పెద్దల వైఖరిపై పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా.. సీఎం చంద్రబాబు (CM Chandrababu)ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు సినీ ప్రముఖులు ముందుకు రాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం సినీ రంగాన్ని, అగ్ర నటులను ఎలా ఇబ్బందులకు గురి చేసిందో అప్పుడే మరిచిపోయారా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వ్యక్తులను కాకుండా, పరిశ్రమ అభివృద్ధిని మాత్రమే దృష్టిలో ఉంచుకుంటుందని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ నుంచి అందిన ఈ ‘రిటర్న్ గిఫ్ట్‌’ను తగిన రీతిలోనే స్వీకరిస్తానని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. టాలీవుడ్ సినీ ప్రముఖులు, కూటమి ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదానికి ఎండ్ కార్డ్ పడబోతోంది. ఈ నెల 15న సీఎం చంద్రబాబును ఉండవల్లి నివాసంలో సాయంత్రం 4 గంటలకు సినీ పెద్దలు కలవనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. ఈ భేటీలో సీని పరిశ్రమలో ఉత్పన్నమైన సమస్యలు, సంక్షేమంపైనే ప్రధానంగా చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది.

Read More..

Chandrababu Naidu: సుపరిపాలనలో తొలి అడుగు.. మలి అడుగు మరింత సక్సెస్ ​అవ్వాలి .. చంద్రబాబు నాయుడు ట్వీట్​

Next Story