వృద్ధి రేటు 1.5 శాతమే…పరిశ్రమల సమాఖ్య అంచనా!

by  |
వృద్ధి రేటు 1.5 శాతమే…పరిశ్రమల సమాఖ్య అంచనా!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 ప్రభావంతో పాటు దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలంగా ఉందని పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) సర్వే నివేదికలో తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధిరేటు 1.5 శాతం మాత్రమే నమోదవొచ్చని అభిప్రాయపడింది. సీఐఐ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు సంబంధించి ఒక ప్రణాళికను వెల్లడించింది. అత్యవసరంగా ఆర్థిక జోక్యం తప్పదని సూచించింది. వృద్ధి అంచనాలను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.

కొనసాగితే మైనస్‌లోకే..
లాక్‌డౌన్‌లో భాగంగా పరిమితుల వల్ల వస్తువుల సరఫరా, ప్రజల కదలికలపై ఆంక్షలు ఉన్న కారణంగా ఆర్థిక కార్యకలాపాలు ఉండే పరిస్థితి. సరఫరా వ్యవస్థకు అంతరాయం ఉండే ఈ స్థితిలో పెట్టుబడులు తగ్గిపోయి, మానవ శక్తి కొరత ఏర్పడుతుంది. అలాగే, కుటుంబ ఆదాయాలలో మార్పులతో వినియోగ డిమాండ్ క్షీణించే అవకాశముంది. లాక్‌డౌన్ అనంతరం ఆర్థిక వ్యవస్థ వేగవంతమైతే జీడీపీ వృద్ధి రేటు 1.5 శాతంగా ఉండొచ్చని నివేదిక అభిప్రాయపడింది. ఒకవేళ, కొవిడ్-19 వ్యాప్తి ఎక్కువ కాలం కొనసాగే పరిస్థితి ఉంటే, హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ఆంక్షలు మరికొంత కాలం కొనసాగడమే కాకుండా, మరిన్ని హాట్‌స్పాట్లు నమోదైతే ఆర్థిక కార్యకలాపాలు తగ్గి జీడీపీ వృద్ధి రేటు మైనస్ 0.9 శాతంగా ఉండొచ్చని పేర్కొంది.

ఏమి చేయొచ్చంటే..

గతంలో ప్రభుత్వం ప్రకటించిన రూ. 1.7 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీతో పాటు జన్‌ధన్ అకౌంట్లలొ రూ. 2 లక్షల కోట్ల నగదు బదిలీ చేయాల్సిన అవసరముందని సీఐఐ నివేదికలో తెలిపింది. అలాగే, బ్యాంకులు అదనపు వర్కింగ్ క్యాపిటల్ పరిమితిని ఇవ్వాలి. రుణగ్రహీతలకు ఏప్రిల్-జూన్ జీతాల బిల్లుకు సమానమైన మొత్తాన్ని 4 నుంచి 5 శాతం వడ్డీ రేటుతో అందించాలని సూచించింది. రూ. 1.5 లక్షల కోట్లతో స్పెషల్ పర్పస్ వెహికల్ లేదంటే కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని అభిప్రాయపడింది.

ఇందులో రూ. 10,000 నుంచి 20,000 కోట్లను బ్యాంకులు, ఎల్ఐసీ, ఈపీఎఫ్, ఎన్ఐఐఎఫ్, పీఎఫ్‌సీ, ఐఐఎఫ్‌సీఎల్ వంటి ఆర్థిక సంస్థలు సమకూర్చాలని, మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం సమకూర్చాలని కోరింది. ఎమ్ఎస్ఎమ్ఈలకు క్రెడిట్ ప్రొటెక్షన్ పథకాన్ని అమలయ్యేలా చూడాలని చెప్పింది. ఈ సంస్థలు తీసుకునే రుణాల్లో సుమారు 80 శాతం వరకు ఆర్‌బీఐ గ్యారెంటీ ఇచ్చేలా క్రెడిట్ ప్రొటెక్షన్ పథకం ఉండాలని, సంస్థలేవైనా డీఫాల్ట్ అయితే ఆ మొత్తాన్ని ఆర్‌బీఐ చెల్లించేలా గ్యారెంటీ ఉండాలని సూచించింది. ఈ ప్రక్రియ కారణంగా రుణ గ్రహీతలకు రిస్క్ తగ్గువగా ఉంటుందని సీఐఐ భావిస్తోంది. వాణిజ్య, పరిశ్రమల రుణాలకు అగ్రో-ప్రాసెసింగ్, సిడ్బీ రంగాల రుణాలకు నాబార్డ్ క్రెడిట్ గ్యారెంటీ ఇవ్వాలని అభిప్రాయపడింది.

ప్రభుత్వం ఏదైనా చేస్తే..

కరోనా వైరస్ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇండియాలో వ్యయం పెరగాల్సిన అవసరముంది. ఆర్థిక వ్యవస్థ తీవ్ర విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న ఇటువంటి సమయంలో ప్రభుత్వం ఏదైనా చేయాల్సిన అత్యవసర స్థితి ఉందని సీఐఐ డైరెకట్ జనరల్ చంద్రజిత్ అన్నారు.

Tags : CII, CII directer general Chandrajit, gross domestic product, GDP growth,

Next Story

Most Viewed