దాని వల్ల దేశవ్యాప్తంగా ప్రతిరోజూ స‌గ‌టున 58 మంది రైతులు చనిపోతున్నారు..!

by  |
ramulu
X

దిశ‌, నర్సాపూర్: ప్రజా వ్యతిరేక విధానాల‌ను అవ‌లంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెదింపేందుకు ప్రజలు ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కా రాములు అన్నారు. శనివారం నర్సాపూర్ పట్టణంలోని షాదీఖానాలో సీపీఎం పార్టీ 14వ మహా సభలు మెద‌క్ జిల్లాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చుక్కా రాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తుందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత చట్టాలను రద్దు చేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా రైతు చట్టాలు తేవడంతో రైతులు ఆందోళన చేసి వాటిని తిప్పి కొట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ, ప్రధాని మోడీ‌ని తిడుతూ అక్కడ వంగివంగి సలాం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కేసీఆర్‌ను నమ్మే పరిస్థితిలో ఎవరు లేరని అన్నారు.

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని ఆరోపించారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వకపోవడంతో దేశవ్యాప్తంగా ప్రతిరోజూ స‌గ‌టున 58 మంది చనిపోతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ మెదక్ జిల్లా కార్యదర్శి మర్రి మల్లేశం, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి జయరాజ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జయలక్ష్మి, నాయకులు మ‌ల్లిఖార్జున్‌, ఎల్లయ్య, యాదవ రెడ్డి , క‌డారి నర్సమ్మ, బస్వరాజ్, మహేందర్రెడ్డి, గౌరయ్య సర్దార్, మల్లేశం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


Next Story