అక్కడ అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా ? వీగిపోతోందా?

by  |
అక్కడ అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా ? వీగిపోతోందా?
X

దిశ ,చిట్యాల: చిట్యాల ఉపసర్పంచ్ పూర్ణచందర్ రావుపై వార్డు సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాసతీర్మానం నెగ్గుతుందా ? వీగిపోతోందా? అనే చర్చ అటు రాజకీయ నాయకుల్లో ఇటు ప్రజల్లో రోజు రోజుకూ హాట్ టాపిక్ గా మారుతోంది. వివరాల్లోకి వెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల గ్రామపంచాయతీ‌కి 2019లో సర్పంచ్‌గా మాసు రాజయ్య ఎన్నికయ్యారు. కొన్నాళ్లు సేవలందించిన ఆయన గత ఏడాది అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో పీఆర్-2018 చట్టప్రకారం ఉప సర్పంచ్‌గా విధులు నిర్వహిస్తున్న పూర్ణచందర్ రావు‌ను చిట్యాల గ్రామపంచాయతీ కి ఇన్చార్జి సర్పంచ్‌గా అధికారులు నియమించారు. కొన్నాళ్ళు సాఫీగా జరిగిన పాలన అనంతరం వార్డు సభ్యులకు, ఆయనకు పంచాయతీ నిధులపై తరచూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఇటీవలే గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు అంతా ఏకమై గత పది రోజుల క్రితం జిల్లా కలెక్టర్, ఎంపీడీఓ, ఎంపీఓ, ఆర్డిఓలకు అవిశ్వాస తీర్మానంపై ఎన్నిక నిర్వహించాలని వినతి పత్రాలను అందజేశారు. అందులో అభివృద్ధి పనుల్లో తప్పుడు లెక్కలు చూపిస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒకరిద్దరిని మినహాయిస్తే మిగతా పదిమంది వార్డు సభ్యులు ఏకమై అవిశ్వాస తీర్మాన ఎన్నికను అధికారులు వెంటనే ప్రకటించాలని పట్టుబడుతున్నారు. దీనిపై చిట్యాల మండల వ్యాప్తంగా హాట్ హాట్‌గా చర్చ నడుస్తోంది.

అవిశ్వాసం వీగిపోతుందా? నెగ్గేనా?

పంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొంటూ వార్డు సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగి పోతుందా? నెగ్గుతుందా? అనే చర్చ చిట్యాలలో నడుస్తోంది. ఎక్కడ నలుగురు రాజకీయ నాయకులు కలిసినా దీనిపైనే చర్చించుకోవడం గమనార్హం. ఒకవేళ పంచాయితీ నిధుల దుర్వినియోగం చేశాడని రుజువైతే మరొక ఉప సర్పంచ్ ను వార్డు సభ్యులు ఎన్నుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇన్చార్జి సర్పంచ్ గా బాధ్యతలు చట్టప్రకారం నిర్వహించాల్సి ఉంటుంది. కాగా గ్రామ పంచాయతీకి మధ్యంతర ఎన్నికలు వస్తే మరోసారి సర్పంచ్ ఎన్నికలకు విపరీతమైన పోటీ నెలకొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏది ఏమైనా ఉప సర్పంచ్ పూర్ణచందర్ రావు పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గితే ఇన్చార్జి సర్పంచ్ నియామకానికి, ఉప సర్పంచ్ ఎన్నికకు లక్షల రూపాయల డబ్బులు చేతులు మారే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ రాజకీయ నాయకులు, ప్రజలు ఆరోపిస్తున్నారు.

ప్లాన్ ప్రకారమే ఉపసర్పంచ్ పై అవిశ్వాసమా?

కొంతమంది వార్డు సభ్యులు ప్లాన్ ప్రకారమే పన్నాగం పన్ని ఉప సర్పంచ్ పూర్ణచందర్ రావు పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని ఆరోపణలు ఓ వైపు నుంచి వినిపిస్తుండగా. మరో వైపు నుంచి కచ్చితంగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడని ముక్త కంఠంతో ఆరోపిస్తున్నారు. మరికొంతమంది అయితే కొంతమంది వార్డు సభ్యులు కేవలం డబ్బుల కోసం ఆయనపైన కావాలనే అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టారని బహిరంగంగానే చర్చించుకోవడం గమనార్హం. ఉపసర్పంచ్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి తెరవెనుక కొంతమంది అధికార పార్టీ నాయకుల హస్తం ఉందని విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైనా వార్డు సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా వీగిపోతుందా అని తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed