ఊరికి, వారికి మధ్య కరోనా అడ్డుగోడైంది!

by  |
ఊరికి, వారికి మధ్య కరోనా అడ్డుగోడైంది!
X

దిశ, ఖమ్మం: ఒకటికాదు, రెండు కాదు ఏకంగా 150 కిలోమీటర్ల మేర కాలినడకన బయలుదేరారు. రెండురోజులుగా నడుస్తూనే ఉన్నారు. ఎండకు వెరవలేదు.. దాహార్తికి గొంతు పూడుకుపోయినా దారి వదలలేదు. ఆకలి బాధిస్తున్నా సొంతూరుకు వెళ్లాలన్న ఆశ వీడలేదు. ఎట్టకేలకు స్వగ్రామానికి చేరుకున్నారు. కానీ, ‘కరోనా’ అనుమానమై ఊరికి, వారికి మధ్య అడ్డుగోడగా నిలిచింది. అంతే… కన్నవూరు కాదుపొమ్మన్నది. చివరికి అధికారుల చొరవతో ఇంటికి వచ్చారు.

చింతకాని మండలం అనంతసాగర్‌‌‌కు చేరుకున్న చింతల తాతారావు(40), పల్లపు వెంకటేశ్‌‌ (19) మార్చి 17న ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని విజ్ఞాన్ వర్సిటీలో పెయింటింగ్‌‌కు కోసం వెళ్లారు. తర్వాత కొద్దిరోజులకే ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. అయినా పనులు నడుస్తుండటంతో అక్కడే ఉండిపోయారు. పెయింటింగ్ పనులు పూర్తి అయిన తర్వాత వారిద్దరు తిరుగుముఖం పట్టారు. ఏప్రిల్ 27న రైలు పట్టాల వెంబడి నడుచుకుంటూ ఖమ్మం పట్టణానికి చేరుకున్నారు. కరోనా కాలం కావడంతో అనుమానం తీర్చుకోవడానికి 28న పరీక్షలు చేశారు. ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, అయినప్పటికీ హోంక్వారంటైన్ పాటించాలని వైద్య సిబ్బంది సూచించారు. వారికి హోంక్వారంటైన్ ముద్ర వేసి పంపించారు. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు అనంత్‌సాగర్‌ చేరుకున్నారు. గ్రామంలోకి రావద్దని ఆశా వర్కర్లు, గ్రామ సెక్రటరీ, సర్పంచ్ సూచించారు. దీంతో గ్రామ శివారులోని మామిడి తోటలో పరదాలు కట్టుకొని ఉన్నారు. తాగడానికి నీళ్లు, రాత్రిపూట కరెంట్ లేక, దోమలు, పాముల భయంతో నరకం చూశామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం మీడియాకు తెలవడంతో అధికారులు తమను గ్రామానికి తరలించారని ‘దిశ’కు వెల్లడించాడు. ఈ విషయం తెలిసి పాలుపోయడానికి కూడా మా ఇంటికి ఎవరూ రావడంలేదని తాతారావు ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే తమ మొక్కజొన్న పంట కోతకు కూలీలు వచ్చేలా చూడాలని తాతారావు అధికారులను బతిమిలాడుకున్నాడు.

tags: Corona Virus, Chintakani, Ananthasagar, Sarpanch, Hope Workers, Guntur Tenali, Painting, Quarantine, Telangana


Next Story

Most Viewed