ఎస్‌బీఐ నకిలీ లింక్‌తో ఖాతాల నుంచి డబ్బు దోచేస్తున్న చైనా హ్యాకర్లు

by  |
cyber crime sbi
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ బ్యాంకు వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని చైనా హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నట్టు సెక్యూరిటీ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఫ్రీ గిఫ్ట్, కేవైసీ అప్‌డేట్ పేరుతో హ్యాకర్లు నకిలీ లింక్‌లను పంపి యూజర్ల ఖాతాల్లోని డబ్బులను దోచేస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి తాజాగా ఢిల్లీకి చెందిన ఆటోబాట్ ఇన్ఫోసెక్, సైబర్‌పీస్ ఫౌండేషన్ సంస్థలు వివరాలను బయటపెడుతూ ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశాయి.

తాము కనిపెట్టిన వాటిలో ఎస్‌బీఐ వెబ్‌సైట్ పేజీ మాదిరిగానే ఉండే నకిలీ లింక్‌ని హ్యాకర్లు పంపిస్తున్నారని, ఆ లింక్ ద్వారా వెళ్లిన నకిలీ పేజీలో యూజర్ల వ్యక్తిగత వివారలను నింపిన వెంటనే బ్యాంకు ఖాతా నుంచి నగదును దొంగలిస్తున్నారని వారు వివరించారు. ఈ నకిలీ లింక్‌లో వచ్చే పేజీలన్నీ అచ్చు ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లాగానే ఉంటాయని, ఉచిత గిఫ్ట్, కేవైసీ అప్‌డేట్ లాంటి వాటితో ఖాతాదారులకు రూ. 50 లక్షల వరకు బహుమతులు లభిస్తాయనే ఎర వేస్తున్నారని సెక్యూరిటీ సంస్థలు తెలిపాయి.

ఇలాంటి వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని వారు పేర్కొన్నారు. ఎస్‌బీఐతో పాటు కోటక్ మహీంద్రా బ్యాంక్, పీఎన్‌బీ అకౌంట్ ఉన్నవారికి కూడా ఇదే రకమైన నకిలీ లింక్ ల మెసేజ్‌లు వస్తున్నట్టు సమాచారం. ఈ హ్యాకర్లు చైనా నుంచి పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా, సెక్యూరిటీ సంస్థల హెచ్చరికలతో ఎస్‌బీఐ తన ఖాతాదారులకు అప్రమత్తంగా ఉండాలని మెసేజ్‌లను పంపించింది. ఎవరికీ వ్యక్తిగత వివరాలను ఇవ్వొద్దని ప్రకటన విడుదల చేసింది.



Next Story

Most Viewed