కరోనా మృతులపై చైనా తప్పుడు లెక్కలు : ట్రంప్

by  |
కరోనా మృతులపై చైనా తప్పుడు లెక్కలు : ట్రంప్
X

చైనా వెల్లడించే కరోనా మరణాల సంఖ్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సందేహాలు వ్యక్తం చేశారు. బాధితుల వివరాలు మృతుల సంఖ్యను చైనా తప్పుగా చెబుతోందని ఆరోపించారు. వైరస్‌ పుట్టిన దేశంలో కంటే అమెరికాలో మరణాలు ఎక్కువగా ఉండటంపై సందేహంగా ఉందని.. కరోనా వైరస్‌పై ఆ దేశం గోప్యత పాటించిందంటూ ఇంటెలిజెన్స్ నివేదిక పేర్కొన్న అనంతరం ట్రంప్ మీడియాతో చెప్పారు. చైనాతోనూ అధ్యక్షుడు జిన్‌పింగ్‌తోనూ మాకు మంచి సంబంధాలే ఉన్నాయి.. కానీ, వాళ్లు చెప్పిన లెక్కలు నిజమనే విషయం మనకెలా తెలుస్తుందని ట్రంప్ ప్రశ్నించారు. నా అంచనా ప్రకారం చైనా చెప్పిన లెక్కల కన్నా ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా రిపబ్లికన్ పార్టీ సభ్యులు కూడా చైనాపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తప్పుడు లెక్కలతో అంతర్జాతీయ సమాజాన్ని చైనా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపబ్లికన్ పార్టీ విదేశీ వ్యవహారాల కమిటీ ఉన్నతాధికారి మైఖేల్ మెక్‌కాల్ ఇదే విషయంపై స్పందిస్తూ కరోనా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకుతుందనే విషయంలో అబద్దం చెప్పిందని, కరోనాపై పోరాటం విషయంలో చైనాను నమ్మకూడదని ఆయన చెప్పారు. మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుందనే విషయాన్ని బయటపెట్టేందుకు ప్రయత్నించిన జర్నలిస్టులు, వైద్యుల నోర్లు మూయించిందని చైనాపై మండిపడ్డారు. ఇక చివరికి బాధితుల సంఖ్యను కూడా దాచి పెడుతోందని విమర్శించారు.

కాగా, బుధవారం సాయంత్రం వరకు చైనా అధికారిక లెక్కల ప్రకారం 82,361 కేసులు నమోదు కాగా అందులో 3,316 మంది మరణించారు. అమెరికాలో 2,06,207 కేసులు నమోదవ్వగా 4,542 మంది మరణించారు.

Tags : Coronavirus, America, china, fatalities, fake, numbers

Next Story