చిన్నారుల పెద్ద మనసు

by  |
చిన్నారుల పెద్ద మనసు
X

దిశ, న్యూస్ బ్యూరో: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) అన్ని రంగాలనూ అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికి విధించిన లాక్ డౌన్‌తో పలువురు ఉపాధి కోల్పోయి కనీసం పూట తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. బియ్యం, కూరగాయలు లేక కన్నీళ్లతో కాలం వెల్లదీస్తున్నారు. ఈ విపత్కాలంలో పేదల కోసం తమ పిగ్గీ బ్యాంకులో నాలుగేండ్లుగా దాచుకున్న రూ.31 వేలను ఖర్చు చేసి తమ పెద్దమనసులను చాటుకున్నారు ఇద్దరు చిన్నారులు. వారిది హైదరాబాద్‌లోని అంబర్‌పేట.

వివరాల్లోకెళితే..చిన్నారులు తానియా బేగం (9), సానియా బేగం (4).వీరి తండ్రి షేక్ సలావుద్దీన్ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ నాయకుడిగా ఉన్నారు. లాక్‌డౌన్‌లో తమ కష్టాలను చెప్పుకునేందుకు అనేక మంది డ్రైవర్లు రోజూ సలావుద్దీన్ ఇంటికి వస్తున్నారు. వారిలో కొందరు కుటుంబాన్ని గడిపేందుకు డబ్బులు లేవని కన్నీళ్లు పెట్టుకున్నారు. డ్రైవర్ల కన్నీళ్లకు ఆ చిన్నారుల మనసులు కదిలిపోయాయి. ఈ నెల 26న సానియా పుట్టిన రోజు కావడంతో తల్లిదండ్రుల వద్దకు వెళ్లి పిగ్గీ బ్యాంకు తెరిచి డబ్బులు తీద్దాం అన్నారు. ‘ఇప్పుడు దుకాణాలు లేకపోవడంతో ఏమీ కొనలేము లాక్‌డౌన్ అయిపోయాక తీసుకుందామన్నా’చిన్నారులు వినలేదు. పిగ్గీ బ్యాంకును పగులగొట్టి అందులోఉన్న నగదుతో బియ్యం, ఇతర వస్తువులను కొనుగోలు చేశారు. సుమారు 75 మంది దినసరి, భవన నిర్మాణ కూలీలకు ఈ చిన్నారులు నిత్యవసరాలను అందించారు. పిల్లలు నాలుగేండ్లుగా దాచుకున్న డబ్బులను ఇలా పేదల కోసం ఖర్చు చేయడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

Tags: Hyderabad, Lockdown, Corona, Help, Donate, Child, humanity,

Next Story

Most Viewed