మూడు రాజధానులపై సీఎం జగన్ కీలక ప్రకటన

by  |
CM Jagan
X

దిశ, ఏపీ బ్యూరో: అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై సీఎం వైఎస్ జగన్ బాంబు పేల్చారు. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చకు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అనుమతించారు. దీంతో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లుపై సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరాన్ని, మూడు రాజధానుల అవసరాన్ని సదుద్దేశంగా వివరించేందుకు, బిల్లులను మరింత మెరుగుపరిచేందుకు అన్ని ప్రాంతాల వారికి అర్థం అయ్యేలా బిల్లును ప్రవేశపెట్టేలా చేసేందుకు ఇంతకుముందు ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. మెరుగైన బిల్లుతో ప్రభుత్వం సభ ముందుకు మళ్లీ వస్తుందని సీఎం జగన్ తెలిపారు. విస్తృత, విశాల, ప్రజాప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం జగన్ తెలిపారు.

రాజధాని పేరుతో తప్పుదోవ పట్టించారు

అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగిస్తూ.. 1953 నుంచి 1956 వరకు ఆంధ్ర రాష్టానికి రాజధానిగా కర్నూలు ఉండేది. గుంటూరులో హైకోర్టు ఉండేది. 1956లో కర్నూలు నుంచి రాజధానిని.. గుంటూరు నుంచి హైకోర్టును హైకోర్టును హైదరాబాద్‌కు తరలించారు. కర్నూలు నుంచి హైదరాబాద్‌కు రాజధాని తరలించిన నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా శ్రీబాగ్ ఒడంబడిక తీసుకువచ్చారు. నాడు రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని సీఎం జగన్ గుర్తు చేశారు. అమరావతిలో రాజధాని పెట్టేందుకు గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అని అందరికీ తెలుసు. శ్రీకృష్ణకమిటీ నివేదికను సైతం ఉల్లంఘించి రాజధానిని ప్రకటించారు. 50వేల ఎకరాల్లో అమరావతి రాజధానిని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నాకు ఈ ప్రాంతం అంటే వ్యతిరేకత లేదు. నా ఇళ్లు కూడా ఇక్కడే ఉంది. నాకు ఈ నేలపై ప్రేమ కూడా ఉంది.

అయితే ఇక్కడ కనీస వసతులు లేవు. అందువల్లే రాజధానిపై అభ్యంతరం వ్యక్తం చేశా. విజయవాడ నుంచి అమరావతి వెళ్లాలంటే 40 కిలోమీటర్లు.. గుంటూరు నుంచి అమరావతి వెళ్లాలన్నా 40 కిలోమీటర్లు. ఎటూ కాకుండా మధ్యలో రాజధానిని ప్రకటించారు. రోడ్డు,డ్రైనేజీ, కరెంట్ ఇలా కనీస వసతులు కూడా లేవు. కనీస వసతులు కావాలంటే ఎకరాకు రూ.2 కోట్లు అవుతాయి. ఇది నేను చెప్పింది కాదు గత ప్రభుత్వం చెప్పినదేనని జగన్ గుర్తు చేశారు. ఈ ప్రాంతానికి మౌళిక వసతులు కల్పించాలంటే లక్ష కోట్లు ఖర్చు అవుతుందని నాడు చంద్రబాబు ప్రభుత్వమే తేల్చి చెప్పిందని జగన్ గుర్తు చేశారు. ఒక పదేళ్లు పోతే దాని విలు ఆరు లక్షల కోట్లుకు పెరిగిపోతుంది. రోడ్డు, కరెంటు, డ్రైనేజీ వేసుకోవడానికే డబ్బులు లేవు అలాంటి పరిస్థితుల్లో రాజధాని అమరావతి అంటూ ఊహా చిత్రాలను విడుదల చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని సీఎం జగన్ విమర్శించారు. రాష్ట్రంలోని యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్, చెన్నైలాంటి ప్రాంతాలకు తరలిపోవాల్సిందేనా. ఈ పరిస్థితి మారదా అని తనకు అనేక సందేహం వచ్చినట్లు సీఎం వ్యాఖ్యానించారు.

విశాఖపట్నం చాలా పెద్దసిటీ

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం చాలా పెద్ద సిటీ అని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. విశాఖపట్నం మరో ఐదేళ్లలో హైదరాబాద్‌తో పోటీ పడుతుందని ఆకాంక్షించారు. రాష్ట్రం అభివృద్ధిలో పరిగెత్తాలనే ఉద్దేశంతో విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలని నిర్ణయించుకున్నాము. అలాగే అమరావతిలో శాసన రాజధానిగా… కర్నూలులో న్యాయ రాజధానిగా పెట్టాలని నిర్ణయించాం. మూడు ప్రాంతాల ప్రజలకు అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా న్యాయం చేయాలనే ఉద్దేశంతో మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకువచ్చాం. గతంలో కేంద్రీకరణ ధోరణలు, వీటిని ప్రజలు ఎంతగా వ్యతిరేకించారో, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు ద్వారా ప్రస్ఫుటంగా వ్యక్తమయింది.

మరోసారి హైదరాబాద్‌ లాంటి సూపర్‌ క్యాపిటల్‌ మోడల్‌ వద్దే వద్దని, అటువంటి చారిత్రక తప్పిదానికి ప్రభుత్వం పాల్పడరాదని ప్రజల తీర్పు స్పష్టం చేసిందని చెప్పారు. కాబట్టే వికేంద్రీకరణే సరైన విధానం అన్నది బలంగా నమ్మి ఈప్రభుత్వం అడుగులు వేసింది. అన్ని ప్రాంతాలు, మతాలు, కులాలు, ఆంక్షలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. అందువల్లే ఈ రెండున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు అంగీకరించారనడానికి జరిగిన ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీని గెలిపించడమే అందుకు నిదర్శనమన్నారు. అయితే వికేంద్రీకరణకు సంబంధించి అనేక అపోహలు, అనేక అనుమానాలు, అనేక కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలు, దుష్ప్రచారాలు.. ఇలా ఈ రెండేళ్ల కాలంలో వీటినే ప్రచారాలు చేశారు. అందరికీ న్యాయం చేయాలన్న ప్రభుత్వ సదుద్దేశాన్ని పక్కనపెట్టి, కొందరికి అన్యాయం జరుగుతుందన్న వాదననుకూడా కొంతమంది ముందుకు తోయడం కూడా మన కళ్లతో చూశాం.

జగన్ ప్రకటనలో ఏముందంటే.!

‘రాజధానుల వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మూడు ప్రాంతాలకూ న్యాయం చేసేలా మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే, ఈ రోజుకు దాని నుంచి మంచి ఫలితాలు ఈ పాటికే అందుబాటులోకి వచ్చేవి. నాటి శ్రీబాగ్‌ ఒడంబడిక స్పూర్తితో, వెనకబడ్డ ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలూ కూడా సమాన అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో వికేంద్రీకరణ బిల్లుల్ని ప్రవేశపెట్టటం జరిగిందని సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఈ నేపథ్యంలో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లుల్లోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్టపరంగాగానీ, న్యాయపరంగాగానీ అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరచేందుకు, బిల్లుల్ని మరింత మెరుగుపరిచేందుకు, అన్ని ప్రాంతాలకు, అందరికీ, విస్తృతంగా వివరించేందుకు ఇంకా ఏవైనా మార్పులు అవసరమైతే వాటినికూడా పొందుపరిచేందుకు, ఇంతకముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని, ఇంతకుముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని, మళ్లీ పూర్తి, సమగ్రమైన, మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. విస్తృత, విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం’ అని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. మెుత్తం ఈ మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏకైక రాజధాని అన్న పదాన్ని ఎక్కడా ఉచ్చరించలేదు. అమరావతియే ఏకైక రాజధాని అని కూడా ప్రస్తావించకపోగా..రాబోయే ఐదేళ్లలో విశాఖపట్నం…హైదరాబాద్‌తో పోటీపడుతుందంటూ చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితులను చూస్తుంటే సీఎం జగన్ మూడు రాజధానుల విషయంలో వెనక్కితగ్గినట్లు కనిపించలేదని తెలుస్తోంది.



Next Story

Most Viewed